
- వ్యాపారి నుంచి లంచం డిమాండ్
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేశ్నాయక్, గన్మెన్ రవి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం.. ఓ వ్యాపారిపై డోర్నకల్ సీహెచ్ఎస్ లో కేసు నమోదైంది. దీంతో సీఐ రాజేశ్ నాయక్ , గన్ మెన్ రవి వ్యాపారిని రూ.50వేలు లంచం డిమాండ్ చేయగా.. రూ.30వేలకు డీల్ కుదుర్చుకున్నాడు.
లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం సీఐ రాజేశ్నాయక్ ఇంట్లో గన్ మెన్ రవితో కలిసి వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించగా లెక్కల్లో లేని రూ.1.25లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ, గన్ మెన్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.