బీజింగ్: చైనా ఫిషింగ్ బోటు ఒకటి హిందూ మహాసముద్రంలో గల్లంతైంది. బోటులోని 39 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని చైనా అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బోటులో 17 మంది చైనా సిబ్బంది, 17 మంది ఇండోనేషియన్లు, ఫిలిప్పీన్స్కు చెందిన ఐదుగురు సహా మొత్తం 39 మంది ఉన్నారని తెలిపారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలలోని సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాలను సంప్రదించినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, బోటు ప్రమాదంలో గల్లంతైనవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాల్లోని రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుని రెస్క్యూ చర్యలు చేపట్టాలని జిన్పింగ్ ఆదేశించారు.