హైదరాబాద్: నగరానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబ్స్కుఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్లో లాభం 18 శాతం పెరిగి రూ. 1,402.50 కోట్లకు చేరుకుంది. ఇది క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 1,187.6 కోట్లు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఆదాయాలు 29 శాతం పెరిగి రూ.6,738.40 కోట్లకు చేరుకున్నాయి. గత క్యూ1లో రూ.5215.40 కోట్ల ఆదాయం వచ్చింది. ఫలితాలపై కో–-చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ తాము బలమైన అమ్మకాల వృద్ధిని సాధించామని, మార్కెట్ వాటా, లాభాలు పెరిగాయని చెప్పారు. తమ యూఎస్ జనరిక్స్ వ్యాపారంలో కొత్త ప్రొడక్టుకు డిమాండ్ పెరిగిందన్నారు. రష్యాలో అత్యుత్తమ పనితీరు కారణంగా మార్జిన్లు భారీగా పెరిగాయని వివరించారు. ఇదిలా ఉంటే, గ్లోబల్ జెనరిక్స్ నుంచి వచ్చే ఆదాయం 36 శాతం పెరిగి రూ.6,101 కోట్లకు చేరింది. ఇబిటా రూ.2,137.2 కోట్లు కాగా, గత సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇది రూ.1,778.9 కోట్లు. ఫ్రీ క్యాష్ఫ్లో విలువ రూ.670 కోట్లు ఉంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీకి నికర నగదు మిగులు రూ.4,980 కోట్లు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి)పై ఖర్చులు రూ. 498.4 కోట్లు ఉన్నాయి. ఇది రాబడిలో 7.4 శాతం శాతానికి సమానం. డైరెక్టర్గా రెండో టర్మ్ పూర్తి చేసిన శ్రీధర్ అయ్యంగార్ వచ్చే నెల వైదొలుగుతారని ప్రకటించింది. ఆయన స్థానంలో అరుణ్ కుమార్ను బోర్డు 31 జూలై 2023 నుండి అమలులోకి వచ్చేలా ఆడిట్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) ముఖేష్ రాఠీ తన స్థానానికి రాజీనామా చేశారు. ఈయన స్థానంలో ఫణిమిత్ర వచ్చే నెల బాధ్యతలు తీసుకుంటారు.
రెవెన్యూ మిక్స్ ఇలా
ఉత్తర అమెరికా 47 శాతం వాటాతో కంపెనీ ఆదాయాలకు అతిపెద్ద కంట్రిబ్యూటర్ కొనసాగింది. ఇండియా సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి 17 శాతం, యూరప్ నుంచి 8 శాతం ఆదాయం వచ్చింది. ఉత్తర- అమెరికన్ మార్కెట్ సంవత్సరానికి 79 శాతం వృద్ధిని సాధించి రూ. 3,197.8 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. వృద్ధికి ప్రధానంగా కొత్త ఉత్పత్తి లాంచ్లు, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులలో కొనసాగిన ఊపు, అనుకూలమైన ఫారెక్స్ రేట్లు, కొంత ధరల తగ్గుదల కారణాలని కంపెనీ తెలిపింది. అయితే ఇండియా మార్కెట్ నుంచి రాబడి వార్షికంగా 14 శాతం తగ్గి రూ. 1,148.2 కోట్లకు పరిమితమయింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ (పీఎస్ఏఐ) మొత్తం ఆదాయంలో 10 శాతానికి దోహదపడింది.