
కామారెడ్డి , వెలుగు: జిల్లా కేంద్రం కామారెడ్డిలో కొత్త మాస్టర్ప్లాన్ ముసాయిదా రగడ మొదలైంది. విలీన గ్రామాల్లోని రైతులతో ఎలాంటి సంప్రతింపులు చేయకుండా1200 ఎకరాలను ఇండస్ర్టియల్ జోన్ గా ప్రతిపాదించడంతో బాధితులు రోడ్డెక్కారు. ఆయా గ్రామాలకు చెందిన వందలాది రైతులు ‘ఐక్య కార్య చరణ కమిటీ’ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ ఆఫీసుకు తరలివచ్చి నిరసన దీక్షలు చేపట్టారు.
తమ అనుమతి లేకుండా పచ్చని పంట భూములను ఇండ స్ర్టియల్ జోన్గా ఎలా చూపుతారని, దీని వల్ల తమ భూముల విలువ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇండ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని, వెంటనే ఇండస్ట్రియల్ జోన్ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ మాస్టర్ ప్లాన్..
రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారుచేయించారు. కామారెడ్డి టౌన్తో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్పల్లిని కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ముసాయిదా రెడీ చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ర్టియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్సియల్జోన్లుగా విభజించి, ఆ వివరాలను ఈమధ్యే రిలీజ్చేశారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు.
ఇండస్ట్రియల్జోన్కోసం 8.5 శాతం(1200 ఎకరాలు) ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులను చెందిన900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్కు పనికిరావని చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్లోనూ ఇండస్ర్టియల్ జోన్లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్రాదని, నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని రైతులు ఆందోలన చెందుతున్నారు. మరోవైపు కామారెడ్డి టౌన్లో జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టని ఆఫీసర్లు, విలీన గ్రామాలైన లింగాపూర్, దేవునిపల్లి, టెకిర్యాల్ లో మాత్రం మూడు100 ఫీట్ల రోడ్లను ప్రతిపాదించారు. వీటిని రూలింగ్పార్టీ లీడర్లు చేసిన వెంచర్లకు అనుకూలంగా ఉండేలా ఏకపక్షంగా ప్రపోజ్చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.
దీంతో విలీన గ్రామాల రైతులు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి ఇప్పటికే 300కు పైగా అభ్యంతరాలు అందజేశారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీసుల ఎదుట ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం నుంచి మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. తొలిరోజు వందల మంది రైతులు వచ్చి, తమ డిమాండ్లు వినిపించారు. బీజీపీ నియోజక వర్గ ఇన్చార్జీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి, డీసీసీ ప్రసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు తదితరలు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
మా భూములు ఎవరు కొంటరు?
నాకు నలుగురు పిల్లలు. నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. టౌన్లో కలిపితే భూమి విలువ పెరుగుతుందని ఆశపడ్డ. కానీ నా భూమిని ఇప్పుడు ఇండస్ర్టియల్ జోన్లో చూపుతున్నరు. రేపొద్దున అవసరాలకు ఓ గుంట భూమి అమ్ముకుందామన్నా ఎవరు కొంటరు. ఇట్లయితే మేం బతికేదెట్ల? గిన్నెలు సర్దుకొని నెత్తిమీద పెట్టుకొని ఊరు వదిలి పోవుడే అయితెట్టుంది. – లోలపు లింగం, అడ్లూర్
మమ్ముల అడగకుండనే 100 ఫీట్ల రోడ్లకు ప్రపోజల్
మా ఊరు మున్సిపాల్టీలో విలీనమైంది. మమ్మల్ని అడగకుండానే మా భూముల్లో 100 ఫీట్ల రోడ్లను వేయనున్నట్లు మాస్టర్ ప్లాన్లో చూపిన్రు. ప్రజలు తిరిగే కామారెడ్డిలోని 80 ఫీట్ల రోడ్డును 60కి కుదిస్తరట. కానీ మా దగ్గర మాత్రం 100 ఫీట్లు తీస్తరట. గింత అన్యాయం ఉంటదా? – రాజేందర్, లింగాపూర్