రాయల్ ఎన్ఫీల్డ్ అంటే..ఇండియన్ యూత్కి బైక్ మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్. అందుకే చాలామంది యువకులు ఆ బైక్ కొనడమే గోల్గా పెట్టుకుంటారు. అంతెందుకు దాని సైలన్సర్ నుంచి వచ్చే ‘డుగ్.. డుగ్.. డుగ్..’ సౌండ్కి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సౌండ్ కోసమే దీన్ని కొనేవాళ్లు లేకపోలేదు. మౌంటెన్ రైడర్ల నుంచి పల్లెల్లో మట్టి రోడ్డు మీద బైక్లు నడిపేవాళ్ల వరకు ఎంతోమందికి ఇది డ్రీమ్ బైక్. ఇండియన్స్ని ఇంతలా ఆకట్టుకున్న ఈ బైక్ కంపెనీ ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది. ఆ పరిస్థితుల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎక్కించాడు ఆ కంపెనీ సీఈవో సిద్ధార్థ్ లాల్.
వరల్డ్ ఫేమస్ ఇండియన్ బైక్గా రాయల్ ఎన్ఫీల్డ్కి పేరుంది. కానీ.. వాస్తవానికి ఇది ఒకప్పుడు ఇండియాకు చెందింది కాదు. ప్రస్తుతం ఇది ఐషర్ మోటార్స్లో భాగంగా ఉంది. బాబ్ వాకర్ స్మిత్, ఆల్బర్ట్ ఈడీ ఇంగ్లాండ్లో సూదులు తయారుచేసే కంపెనీని నడిపేవాళ్లు. వీళ్లు 1893లో రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎన్ఫీల్డ్ అనే కంపెనీకి సైకిళ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దాంతో సూదులు తయారు చేయడం ఆపేసి తమ ఫ్యాక్టరీ పేరుని ‘ఎన్ఫీల్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్’గా మార్చారు. ‘ఎన్ఫీల్డ్’ పేరుతో సైకిల్ తయారు చేసి మార్కెట్ చేశారు. ఆ తర్వాత ఏడాదే వాళ్ల సైకిళ్ల పేరును ‘రాయల్ ఎన్ఫీల్డ్’గా మార్చారు. తర్వాత1900లో మొట్టమొదటి మోటరైజ్డ్ వెహికల్ తయారుచేశారు. ఇది రెండు సైకిళ్లను ఒకచోట చేర్చినట్టు ఉంటుంది. దీన్ని ‘క్వాడ్రి సైకిల్’ అని పిలిచేవాళ్లు. మౌంటెడ్ ఇంజిన్తో నడిచేది.
ఈ వ్యాపారంలో లాభాలు బాగా రావడంతో బైక్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఎన్ఫీల్డ్ 1901లో 297 సీసీ మోటోసాకోచె ఇంజిన్ని ఉపయోగించి మొదటి మోటార్సైకిల్ను విడుదల చేసింది. కొన్నాళ్లకు 1924లో స్పోర్ట్స్ మోడల్ 351 ని ఫుట్ ఆపరేటెడ్ గేర్తో తీసుకొచ్చింది. దాని తర్వాత మరో ఎనిమిది మోడళ్లు రిలీజ్ అయ్యాయి.
బుల్లెట్ బండి
ఇప్పుడు ఇండియాతోపాటు ఎన్నో దేశాల్లో ఆదరణ పొందిన ‘‘బుల్లెట్” బండి 1932లో పుట్టింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బుల్లెట్ బైక్ని తయారుచేశాక మొదటిసారిగా లండన్లో జరిగిన ఒలింపియా మోటార్సైకిల్ షోలో ప్రదర్శించారు. మొదటగా 250, 350, 500 సీసీల కెపాసిటీతో మూడు మోడళ్లను రిలీజ్ చేశారు. అన్నింటికీ వంపు తిరిగిన ‘స్లోపర్’ ఇంజిన్లు ఉండేవి. ట్విన్- పోర్టెడ్ సిలిండర్ హెడ్లు, ఫుట్ ఆపరేటెడ్ గేర్ ఛేంజ్, హై కంప్రెషన్ పిస్టన్లతో వీటిని తయారుచేశారు. తర్వాత 1936లో 500సీసీ బుల్లెట్ని చాలావరకు మార్చేశారు. ఇది 4-వాల్వ్ సిలిండర్ హెడ్తో నిటారుగా ఉండే ఇంజిన్తో వచ్చింది. ఆ తర్వాత అనేక దశల్లో మారుతూ ప్రస్తుతం మనం చూస్తున్న బుల్లెట్ రూపానికి వచ్చింది.
ఇండియన్ మార్కెట్లోకి
కేఆర్ సుందరం అయ్యర్ అనే బిజినెస్ మ్యాన్ రాయల్ ఎన్ఫీల్డ్తో సహా బ్రిటిష్ మోటార్సైకిళ్లను ఇండియాలోకి దిగుమతి చేసుకునేందుకు ‘మద్రాస్ మోటార్స్’ని 1949లో స్థాపించాడు. అలా ఎన్ఫీల్డ్ ఆ ఏడాది నుంచి ఇండియన్ మార్కెట్లో మోటార్సైకిళ్లను అమ్మడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మన దగ్గర బుల్లెట్ మోడల్కు ఆదరణ బాగా వచ్చింది. అందుకే ఇండియన్ ఆర్మీ కూడా ఈ బైక్లు వాడాలి అనుకుంది.1952లో మద్రాస్ మోటార్స్కి 500, 350సీసీ బుల్లెట్ల కోసం ఇండియన్ ఆర్మీ నుండి ఆర్డర్ వచ్చింది. దాదాపు ఎనిమిది వందల బైక్స్ ఆర్మీ కోసం కొన్నారు. అప్పట్లో పెట్రోలింగ్ చేయడానికి వీటినే వాడేవాళ్లు. తర్వాత కొన్నాళ్లకు ఇంగ్లాండ్లో కంపెనీకి బాగా నష్టాలు వచ్చాయి. 1990లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో అప్పటికే ఫేమస్ అయిన ఆటోమోటివ్ కంపెనీ ఐషర్ గ్రూప్తో కలిసి బైక్స్ తెచ్చింది. తర్వాత మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. దాంతో 1994లో ఐషర్లో విలీనమైంది.
నష్టాలతోనే...
ఐషర్ కంపెనీ కొన్నాక కూడా రాయల్ ఎన్ఫీల్డ్కు విపరీతమైన నష్టాలు వచ్చాయి. 2000 సంవత్సరంలో నెలకు 2000 యూనిట్ల కంటే తక్కువగా అమ్ముడయ్యాయి. బైక్స్ క్వాలిటీ బాగా తగ్గింది. ఇతర కంపెనీలు బాగా పోటీ ఇచ్చాయి. కాలం చెల్లిన డిజైన్ వల్ల కంపెనీకి నష్టాలు తప్పలేదు. దాంతో రాయల్ ఎన్ఫీల్డ్ పని అయిపోయింది అనుకున్నారు అంతా. కంపెనీ మూసేయాలని చాలామంది సలహా ఇచ్చారు కూడా.
సక్సెస్కు అంబాసిడర్
ఐషర్ కంపెనీని విక్రమ్ లాల్ స్థాపించాడు. కష్టపడి వ్యాపారాన్ని విస్తరించాడు. ఒకప్పుడు ఐషర్ కంపెనీ ట్రాక్టర్ల తయారీలో రారాజు. అంతటి వ్యాపార వేత్త అయిన విక్రమ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ని లాభాల వైపు నడిపించలేకపోయాడు. అదే టైంలో అతని కొడుకు సిద్ధార్థ లాల్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బాధ్యతలు పూర్తిగా ఆయనే తీసుకున్నాడు. కొన్నేండ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ను ప్రపంచవ్యాప్తంగా సేల్ చేసే సూపర్ బైక్గా మార్చగలిగాడు.
ఎన్ఫీల్డ్ కోసం 13 కంపెనీలు
లాల్కు చిన్నప్పటినుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే దాన్ని కాపాడుకోవాలి అనుకున్నాడు. 2000లో ఇండస్ట్రీకి వచ్చిన లాల్ ముందుగా ఎన్ఫీల్డ్ నష్టాలకు కారణాలు తెలుసుకున్నాడు. అప్పటికే ఐషర్ కంపెనీ ట్రాక్టర్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్ళు, విడి భాగాలు... ఇలా 15 వ్యాపారాలు చేసేది. కానీ.. ఎందులోనూ మార్కెట్ లీడర్గా లేదు. అందుకే లాల్ 13 బిజెనెస్లు మూసేసి, రెండింటి పైనే ఫోకస్ పెట్టాలి అనుకున్నాడు. దాంతో అన్నింటిని అమ్మేశాడు. ఆ డబ్బుని రాయల్ ఎన్ఫీల్డ్, ట్రక్కుల తయారీలో పెట్టాడు. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. నష్టాల్లో ఉన్న ఎన్ఫీల్డ్ మీద ఖర్చు చేస్తే.. కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ.. ఆ మాటలు పట్టించుకోలేదు ఆయన. అంతెందుకు వాళ్ల నాన్న విక్రమ్ లాల్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ను మూసేయమని సలహా ఇచ్చాడు. అయినా.. వినకుండా సిద్ధార్థ లాల్ పగలు, రాత్రి కష్టపడి రాయల్ ఎన్ఫీల్డ్ని మార్కెట్లో నిలదొక్కుకునేలా చేశాడు. అందుకోసం ఆయనే స్వయంగా వేల కిలోమీటర్లు బైక్ రైడ్ చేసి, బైకర్ల ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాడు. యూత్ ఎలాంటి బైక్స్ఇష్టపడుతున్నారో ఆయనకు అర్థమైంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న లోపాల గురించి కూడా తెలుసుకున్నాడు. తర్వాత మోడళ్లలో అనేక మార్పులు చేసి ఆ లోపాలను సరిచేశాడు. చివరికి సిద్ధార్థ్ కష్టానికి ఫలితం దక్కింది. కొన్నేండ్లలోనే బుల్లెట్ బండి రోడ్డుపై ‘రయ్.. రయ్..’ అంటూ పరుగులు పెట్టింది. సేల్స్ బాగా పెరిగాయి. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదు అనుకున్న బైక్.. ఇప్పుడు లక్షలమందికి డ్రీమ్ బైక్ అయింది.
ఒక్కసారిగా రాలేదు
సిద్ధార్థ్ కష్టపడినా ఆయనకు ఒక్కసారిగా సక్సెస్ రాలేదు. అందుకు చాలా టైం పట్టింది. 2005 నాటికి కంపెనీ ప్రతి ఏడాది దాదాపు 25,000 బైక్లు మాత్రమే అమ్మేది. సిద్ధార్థ లాల్ ఎన్ఫీల్డ్ బైక్ల్లో ఉన్న ఇంజినీరింగ్ లోపాలు సరిచేయడంతో బైక్ల క్వాలిటీ పెరిగింది. దాంతో బైక్ మెయింటెనెన్స్ తగ్గింది. సిద్ధార్థ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ‘హంటర్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, క్లాసిక్ 350, మీటోర్ 350, 350 సీసీ బుల్లెట్ ఎలక్ట్రా, థండర్బర్డ్’ మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఈ బైక్ల రాకతో అప్పటివరకు రైడర్స్ బైక్గా పేరున్న ఎన్ఫీల్డ్ని అందరూ వాడడం మొదలుపెట్టారు. పైగా లాల్ మోటార్ సైక్లింగ్ కల్చర్ని డెవలప్ చేశాక సేల్స్ పెరిగాయి. 2010లో కంపెనీ 50,000 బైక్స్ అమ్మింది. 2014లో అమ్మకాలు ఏకంగా 5,89,293కి పెరిగాయి. దాంతో ఐషర్ మోటార్స్కి 8,738 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో 702 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ లాభాల్లో 80% రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే వచ్చాయి. కంపెనీని మూసేయమని సలహా ఇచ్చినవాళ్లలో చాలామంది ఐషర్ షేర్స్ కొన్నారు. అంతేకాదు.. 2015లో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా హార్లే డేవిడ్సన్ బైక్ల కంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. దాంతో ఐషర్ మోటార్స్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఆటోమొబైల్ స్టాక్ల్లో ఒకటిగా మారింది.
రెండో ప్రపంచ యుద్ధంలో ...
రాయల్ ఎన్ఫీల్డ్కు రెండో ప్రపంచ యుద్ధం టైంలో భారీగా సైనిక మోటార్ సైకిళ్ళ ఆర్డర్లు వచ్చాయి. ఈ బైక్లు యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్ఫీల్డ్ కంపెనీ సైకిళ్ళు, జనరేటర్లు, యాంట్-ఎయిర్క్రాఫ్ట్ గన్ ప్రెడిక్టర్లు కూడా యుద్ధ సైనికులకు సరఫరా చేసింది. ముఖ్యంగా అప్పట్లో బాగా ఫేమస్ అయిన ‘ఎయిర్బోర్న్’ 125 సీసీ మోటార్సైకిల్ను ఫ్లయింగ్ ఫ్లీ అని పిలిచేవాళ్లు. దీన్ని2-స్ట్రోక్ ఇంజిన్తో ప్రత్యేకంగా తయారుచేశారు. దీన్ని పారాచూట్ క్రెడిల్స్లోకి కూడా లోడ్ చేసే అవకాశం ఉండేది.