- గత వారం రెండు రూమ్స్లో వీకెండ్ పార్టీలు నిర్వహించిన వివేకానంద
- సప్లయర్ అబ్బాస్, డ్రైవర్ ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో వెల్లడి
- పార్టీలో పాల్గొన్న 9 మందికి నోటీసులు.. డ్రగ్స్ పెడ్లర్ మీర్ వహీద్ బేగ్ కూడా అరెస్ట్
- పరారీలో నీల్, లిషిత, శ్వేత, మరో ఐదుగురు.. డైరెక్టర్ క్రిష్ను విచారించేందుకు రంగం సిద్ధం
హైదరాబాద్, వెలుగు: రాడిసన్ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ పెడ్లర్ మీర్ వహీద్ బేగ్ను గురువారం అరెస్ట్ చేశారు. ముగ్గురి సాయంతో వారు కొకైన్ తరలించినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న రఘుచరణ్ శాంపిల్స్ సేకరించారు. సినీ డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ను త్వరలో విచారించనున్నారు. రాడిసన్ హోటల్లో వీకెండ్ డ్రగ్స్ పార్టీలు ఏడాది కాలంగా నిర్వహిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. గత శనివారం గచ్చిబౌలిలోని ఈ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన సంగతి తెలిసిందే. రాడిసన్ హోటల్, మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గజ్జల వివేకానంద ఈ పార్టీ నిర్వహించాడు.
ఈ కేసులో వివేకానంద, నిర్భయ్, కేథార్ నాథ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ సప్లయ్ చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ, వివేకానంద కారు డ్రైవర్ గద్దల ప్రవీణ్ను బుధవారం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిద్దరి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు. వివేకానంద అమెరికాలో మాస్టర్స్ చదివాడు. 2010లో భారత్కు తిరిగి వచ్చాడు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్, మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదులను అతను వినియోగిస్తున్నాడు. లిక్కర్కు బానిసైన అతను.. క్రమంగా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు. రాడిసన్ హోటల్లో తన ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవాడు. కంపెనీ సమావేశాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు రాడిసన్ హోటల్ను అడ్డాగా మార్చుకున్నాడు. గతంలో మంజీరా కన్స్ట్రక్షన్స్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీతో డ్రగ్స్ సేకరించేవాడు.
డ్రగ్స్ డెలివరీలో కారు డ్రైవర్ పాత్ర
యాకుత్పురాకు చెందిన అబ్బాస్ అలీ గతంలో మంజీరా కన్స్ట్రక్షన్స్లో మార్కెటింగ్ వింగ్లో పనిచేసేవాడు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వివేకానంద నిర్వహించే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఇందు కోసం ఓల్డ్ సిటీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వహీద్ బేగ్ వద్ద అతను డ్రగ్స్ కొనేవాడు. ఇందుకు ఒక్కో గ్రాము కొకైన్కు వివేకానంద రూ.14 వేలు చెల్లించేవాడు. డెలివరీ కోసం అదనంగా మరో రూ.2 వేలు ఇచ్చేవాడు. అబ్బాస్ సేకరించిన కొకైన్ను వివేకానంద కారు డ్రైవర్ గద్దల ప్రవీణ్ డెలివరీ చేసేవాడు. ప్రవీణ్ తన గూగుల్ పే నుంచి అబ్బాస్, మీర్జా వహీద్ ఖాన్కు డబ్బులు పంపేవాడు.
ప్రతి వీకెండ్లో వివేకానంద డ్రగ్స్ పార్టీలు
పార్టీ కోసం ఫిబ్రవరి 16న వివేకానంద 2 గ్రాముల కొకైన్ ఆర్డర్ చేశాడు. దీంతో గచ్చిబౌలి ఒలివ్ సర్వీస్ అపార్ట్మెంట్ వద్ద మీర్జా నుంచి అబ్బాస్ డ్రగ్స్ సేకరించి వివేకానంద కారు డ్రైవర్ ప్రవీణ్కు అందించాడు. ఇందుకు వివేకానంద.. ప్రవీణ్ ద్వారా రూ.3 వేలు డెలివరీ చార్జీలతో పాటు రూ.30 వేలు చెల్లించాడు. 17న ఫిల్మ్ నగర్లో మరో 2 గ్రాముల కొకైన్ను మీర్జా సప్లయ్ చేశాడు. 18, 19న అబ్బాస్ మరో 3 గ్రాముల కొకైన్, సిగరెట్లను ప్రవీణ్కు అందించాడు. ఇందుకు రూ.35,200 ప్రవీణ్ ద్వారా వివేకానంద చెల్లించాడు. ఇలా 6 గ్రాముల కొకైన్ను ప్రవీణ్ సేకరించి వివేకానందకు చేరవేశాడు. ఇలా సేకరించిన కొకైన్తో ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్లో వివేకానంద పార్టీ నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్కి వెళ్లేసరికి అందరూ పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వివేకానంద సహా మరో 8 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
లిషిత కనిపించడం లేదని పోలీసులకు సోదరి ఫిర్యాదు
డైరెక్టర్ క్రిష్, లిషిత, శ్వేత, నీల్, రఘుచరణ్, సందీప్, నిర్భయ్ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. లిషిత పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతోంది. దీంతో లిషిత ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అయితే వారం రోజులుగా లిషిత కనింపించడం లేదంటూ ఆమె సోదరి కుషిత పోలీసులకు సమాచారం ఇచ్చింది. తమ లాయర్ ద్వారా పోలీసుల నోటీస్కు సమాధానం ఇచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిన డైరెక్టర్ క్రిష్ ముంబైలో ఉన్నాడు. విచారణకు రావాలని పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకానున్నాడు. నీల్ విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది.