హైవేలపై ప్రమాదాలకు చెక్.. విస్తృతంగా వెహికల్ చెకింగ్

హైవేలపై ప్రమాదాలకు చెక్.. విస్తృతంగా వెహికల్ చెకింగ్
  • డ్రంక్ అండ్​డ్రైవ్​ టెస్టుల్లో పట్టుబడితే కేసులు 
  • ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులు సీజ్​​
  • స్పీడ్​ కంట్రోల్​ చేసేందుకు ‘గన్స్’​

కామారెడ్డి​, వెలుగు: ఇటీవల హైవేలపై యాక్సిడెంట్లు పెరగడం.. మరణాలు ఎక్కువ కావడంతో అధికారులు అలెర్ట్​ అయ్యారు. జిల్లా పరిధిలోని హైవేల మీద యాక్సిడెంట్లను నివారించడంపై ఫోకస్​ పెట్టారు. రాంగ్​రూట్​లో వాహనాలు నడపడం, ఓవర్​ స్పీడ్, డ్రంక్​అండ్​డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. నెల రోజుల కింద ఓ టిప్పర్​ రాంగ్​రూట్లో వచ్చి స్ర్కూటీని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.

శనివారం రాత్రి ఆదిలాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్​బస్సు భిక్కనూరు దగ్గర అతివేగంగా వచ్చి ప్రమాదాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీ కొట్టింది. డ్రైవర్​కు బ్రీత్​ ఎనలైజర్​ టెస్ట్​ చేయగా అతడు మద్యం తాగినట్టు తేలింది. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

 వారిని పోలీసులు వేరే బస్సులో పంపారు. 

జిల్లా మీదుగా 2 నేషనల్​హైవేలు వెళ్తున్నాయి. 44 వ నెంబర్​హైవే 50 కిలోమీటర్ల మేరకు ఉండగా.. సంగారెడ్డి,- అకోలా, నాందేడ్​హైవే 60 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గాల్లో రోజూ వేలాది వెహికల్స్ తిరుగుతుంటాయి. జిల్లాలో ప్రమాదాల నియంత్రణకు యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. హైవేలపై రాత్రిపూట వెహికల్​ చెకింగ్ విస్తృతం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లకు బ్రీత్​ఎనలైజర్​ టెస్ట్​లు చేస్తున్నారు. పాజిటివ్​ వచ్చిన డ్రైవర్లపై కేసులు పెడుతున్నారు.

 10 రోజుల్లో 2 ప్రైవేట్ బస్సులను సీజ్​ చేసిన పోలీసులు.. ప్రయాణీకులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. లారీలు, కార్లు ఇతర వెహికల్స్​ను కూడా తనిఖీ చేస్తూ మద్యం తాగి డ్రైవింగ్​ చేసినట్టు తేలితే కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసుల్లో కోర్టులు జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఓవర్​ స్పీడ్​ నియంత్రణ కోసం హైవేలపై రెండు చోట్ల స్పీడ్ గన్స్​ ఏర్పాటు చేశారు.తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్​ స్పాట్​లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. 

జిల్లా పరిధిలో జరిగిన యాక్సిడెంట్లలో నిరుడు 270 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 176 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో దాదాపు సగం హైవేలపై జరిగినవే. 
ఈ నెల 6న రాత్రి భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద 1,139 వెహికల్స్​ తనిఖీలు చేయగా ఇందులో 27 మంది డ్రైవర్లు మద్యం తాగినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. రాత్రి పూట నాగ్​పూర్​, హైదరాబాద్​ల మధ్య నడిచే బస్సుల డ్రైవర్లు కూడా మద్యం తాగినట్టు తేలడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. 

భద్రతకే పెద్దపీట 

ప్రయాణీకుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రమాదాల నివారణకు విస్తృతంగా వెహికల్స్​తనిఖీలు చేస్తున్నాం. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్టులు చేస్తున్నాం. పలువురు మద్యం తాగి వెహికల్స్​ నడుపుతున్నట్టు గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్​ డ్రైవర్లు మద్యం తాగినట్టు అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. - రాజేష్ చంద్ర, ఎస్పీ,- కామారెడ్డి