చిన్నారిని సంపులో పడేసి చంపిన తండ్రి

చిన్నారిని సంపులో పడేసి చంపిన తండ్రి
  • మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన తండ్రి

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం లోని తొండుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రే మద్యం మత్తులో 8 నెలల చిన్నారిని సంపులో పడేశాడు. బాలుడు మృతి చెందడంతో పోలీసులు తండ్రి విక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. శంషాబాద్ మండలంలోని తొండుపల్లి కి చెందిన విక్రమ్ కు స్పందన అనే యువతితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల తర్వాత వీరికి బాబు జన్మించాడు. బాబుకు ఇప్పుడు వయసు 8 నెలలు. మద్యానికి బానిసైన విక్రమ్ తరచూ ఇంట్లో గొడవపడేవాడు. నిన్న మంగళవారం రాత్రి కూడా భార్య తో గొడవ పడిన విక్రమ్ బాబును ఎత్తుకెళ్లి నీటి సంపులో పడేశాడు. భార్య గమనించేలోపే బాబు మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారిని కట్టుకున్న మొగుడే చంపేయడంతో భార్య స్పందన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రి విక్రమ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాబు మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.