- ఎగ్జామ్స్ వాయిదా పడటంతో అప్లై డేట్ పెంచే యోచన
- ఇప్పటికే దరఖాస్తుల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం
- ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణ!
హైదరాబాద్, వెలుగు : టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ ఎగ్జామ్ దరఖాస్తులు లక్ష దాటాయి. మంగళవారం మధ్యాహ్నానికి 1,01,176 మంది అప్లై చేసుకున్నారు. వీటిలో సగం ఎస్జీటీ పోస్టులకు సంబంధించినవే ఉన్నాయి. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు.. గత నెల 20 నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన లక్ష అప్లికేషన్లలో ఎస్జీటీ పోస్టులకు 44 వేల మంది
స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కు 16,350, ఎస్ఏ బయోలజికల్ సైన్స్ కు 13,600, ఎస్ఏ మ్యాథ్స్ కు 7,300, ఎస్ఏ తెలుగుకు 6 వేలు, లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు 5,150 అప్లికేషన్లు వచ్చాయి. పీఈటీ పోస్టులకు 2,700, పీడీ పోస్టులకు750 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్కు కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.10 కోట్ల ఆదాయం సమకూరింది.
దరఖాస్తుకు మరో రెండు, మూడు వారాల గడువు
నవంబర్20 నుంచి 30 వరకు జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఎప్పుడు నిర్వహించేదానిపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్, జనవరిలో నిర్వహించే అవకా శం లేదని, ఫిబ్రవరిలో పరీక్షలు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు అభ్యర్థుల డిమాండ్ మేరకు దరఖాస్తుల గడువును మరో రెండు మూడు వారాలు పెంచే అవకాశం ఉంది.