వెలుగు బిజినెస్ డెస్క్: దేశంలో బంగారం డిమాండ్ కొవిడ్ ముందు లెవెల్స్కు చేరింది. జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో బంగారం డిమాండ్ 191.7 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది బంగారం గిరాకీలో 14 శాతం గ్రోత్ కనిపిస్తోందని పేర్కొంది. గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ3 2022 పేరుతో ఒక రిపోర్టును డబ్ల్యూజీసీ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ 168 టన్నులు. కన్జూమర్ల ఆసక్తి వల్ల దేశంలో బంగారం డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుంజుకున్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. ఇదే కాలంలో దేశంలో జ్యుయెలరీ డిమాండ్ 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా రికార్డయింది. ఈ డిమాండ్ 2021 జులై–సెప్టెంబర్ మధ్యలో 125.1 టన్నులే. విలువపరంగా చూస్తే జ్యుయెలరీ డిమాండ్ దేశంలో 22 శాతం ఎక్కువై రూ. 64,860 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్లో ఇది రూ. 53,330 కోట్లే. ఇండియాలో బంగారపు కడ్డీలు, కాయిన్స్ డిమాండ్ కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ డిమాండ్ 6 శాతం ఎక్కువై 45.4 టన్నులకు చేరినట్లు డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. ఈక్విటీ మార్కెట్ల జోరు తగ్గడంతోపాటు, గోల్డ్ రేట్లు తక్కువగా ఉండటం రిటెయిల్ ఇన్వెస్టర్లను ఆకర్షించినట్లు పేర్కొంది. కొవిడ్ వల్ల గత రెండేళ్లలో పండగలను కూడా పూర్తి స్థాయిలో ఎవరూ జరుపుకోలేదు. ఈ ఏడాది అందరూ పండగలను ఘనంగా జరుపుకునేందుకు ఇష్టపడ్డారని కూడా డబ్ల్యూజీసీ ఈ రిపోర్టులో వివరించింది. దీని ఫలితంగానే బంగారానికి డిమాండ్ పెరిగిందని తెలిపింది. రాబోయే రోజుల్లోనూ దేశంలో రిటెయిల్ ఇన్వెస్టర్ల నుంచి బంగారానికి డిమాండ్ పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీపావళితోపాటు, పెళ్లిళ్లూ జోరందుకోవడంతో తర్వాతి నెలల్లో గోల్డ్ గిరాకీ ఇదే లెవెల్లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కానీ, కిందటేడాది పెర్ఫార్మెన్స్ ఈ ఏడాది ఉండకపోవచ్చని చెబుతూ, ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ 750–800 టన్నుల దాకా ఉండొచ్చని పేర్కొంది. 2021లో దేశంలోకి 1,003 టన్నుల బంగారం దిగుమతయింది. ఈసారి కూడా దానిని దాటకపోవచ్చని డబ్ల్యూజీసీ రిపోర్టు అంచనా వేసింది.
బ్యాంకులు ఇచ్చే అప్పులు పెరగడం వల్ల బంగారం డిమాండ్ బాగా పుంజుకుంది. బ్యాంకుల అప్పులు ఈ క్వార్టర్ చివరి 9 ఏళ్ల గరిష్టానికి చేరాయి. బంగారం డిమాండ్ పట్టణ ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాలలో బంగారం డిమాండ్ ఇంకా పుంజుకోలేదు. రుతుపవనాలు, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అక్కడ కనబడుతోంది. - పీఆర్ సోమసుందరం, సీఈఓ, డబ్ల్యూజీసీ ఇండియా