- 14న ట్యాంక్బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
- అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
- మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు అమలు
హైదరాబాద్, వెలుగు : అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇయ్యాల మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన నోటిషికేషన్ను గురువారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మార్గ్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌడ్ రోడ్, లుంబినీ పార్కును మూసి వేయనున్నట్లు ప్రకటించారు.
ఖైరతాబాద్లోని జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్లో వెహికల్స్కు అనుమతి లేదన్నారు. ఖైరతాబాద్, రాణిగంజ్, లిబర్టీ, తెలుగు ఫ్లై ఓవర్ నుంచి వెహికల్స్ ను దారి మళ్లిస్తామని.. వాహనదారులు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్రోడ్ వైపు వెళ్లే వెహికల్స్ షాదన్ కాలేజ్, నిరంకారీ భవన్, లక్డీకపూల్ మీదుగా వెళ్లాలి.
- ట్యాంక్బండ్ నుంచి పీవీఆర్ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వెహికల్స్ రాణిగంజ్, కర్బాల మైదాన్ మీదుగా వెళ్లాలి.
- రసూల్పురా, మినిస్టర్ రోడ్, నుంచి ట్రాఫిక్ను నల్లగుట్ట జంక్షన్, రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వచ్చే వెహికల్స్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలి.
- బీఆర్కే భవన్, ట్యాంక్బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వెహికల్స్ ను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇక్బాల్ మినార్ వైపు దారి మళ్లించనున్నారు.
- ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ను రాజ్దూత్ లేన్ వైపు దారి మళ్లించనున్నారు.
- అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా పంపించనున్నారు.