
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సోమవారం రాత్రి భూమి కంపించడం, జైలులో గందరగోళం నెలకొనడంతో అదే అదనుగా రెండు వందలకుపైగా మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఓ ఖైదీ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పారిపోయిన ఖైదీల్లో 75 మందిని వెతికి పట్టుకోగా, మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ముందుగా సోమవారం రాత్రి కరాచీలో భూమి తీవ్రంగా కంపించడంతో నగరంలోని మాలిర్ జిల్లా జైలు పరిసరాలు ఊగిపోయాయి.
జైలు గోడలు నెర్రెలుబారడంతో సిబ్బంది ముందు జాగ్రత్తగా ఖైదీలను బ్యారక్ల నుంచి బయటకు విడుదల చేశారు. దీంతో జైలులోపల మెయిన్ గేటు వద్ద ఖాళీ స్థలంలోకి సుమారు వెయ్యి మంది ఖైదీలు పోగయ్యారు. ఈ సందర్భంగా కొందరు కరుడుగట్టిన క్రిమినల్స్ మెయిన్ గేటు ఓపెన్ చేయాలంటూ జైలు సిబ్బందితో గొడవకు దిగారు. వారి తుపాకులు లాక్కుని కాల్పులు జరుపుతూ, బలవంతంగా గేటును ఓపెన్ చేయించి పరార్ అయ్యారు. దీంతో వారి వెంబడి మిగతా ఖైదీలు కూడా కొందరు మెయిన్ గేటు ద్వారా సిటీలోకి పరుగులు తీశారు.
కరాచీలో హైఅలర్ట్..
మొత్తం 216 మంది ఖైదీలు పారిపోగా, మంగళవారం ఉదయం సమయానికి 75 మందిని వెతికి పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. ఖైదీలకు, జైలు సిబ్బందికి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఖైదీ చనిపోగా, మరికొందరు ఖైదీలు గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో జైలు గార్డుతోపాటు మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది ఖైదీలు సిటీలోకి పారిపోవడంతో కరాచీ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి, పోలీసులు గాలింపులు చేపట్టారు. కాగా, జైలు నుంచి ఖైదీలు పారిపోయి వచ్చిన ఖైదీలు కరాచీ సిటీలో పరుగెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తుర్కియేలో పెను భూకంపం
తుర్కియే తీరప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. మర్మారిస్ సమీపంలో మధ్యధరా సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటపడే క్రమంలో కిటికీలు, బాల్కనీల నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో డజన్లకొద్దీ మంది గాయపడ్డారు.
ఒక టీనేజీ బాలిక మరణించింది. ఈ విపత్తుపై తుర్కియే ఇంటీరియల్ మినిస్టర్ అలీ యెర్లికాయ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ఒక14 ఏండ్ల బాలిక తీవ్రంగా గాయపడిందని ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించిందని చెప్పారు. ఈ భూకంపం కారణంగా గ్రీస్ దీవి రోడ్స్ ఐలాండ్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తుర్కియేలో 2023లోను 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 53వేల మందికి పైగా మరణించారు. లక్షలాది భవనాలు ధ్వంసమయ్యాయి.