గ్రీస్ లో భారీ భూకంపం : టర్కీ సిటీలో జనం పరుగులు

గ్రీస్ లో భారీ భూకంపం : టర్కీ సిటీలో జనం పరుగులు

గ్రీస్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది. రోడ్స్ ద్వీపం కేంద్రంగా 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావం టర్కీతోపాటు సిరియాలోనూ ప్రభావం చూపించింది. టర్కీలో అయితే అర్థరాత్రి జనం రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. భారీ భవనాలు ఊగిపోయాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం జరక్కపోయినా.. ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

రోడ్స్ ద్వీపం కేంద్రంగా.. భూమికి 40 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉందని.. టర్కీ టైం ప్రకారం అర్థరాత్రి 2 గంటల సమయంలో వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. టర్కీలోని ముగ్లా ప్రావిన్స్ లోని ఓ భవనం దెబ్బతినటంతో.. ఏడుగురు గాయపడ్డారు. ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. చాలా మంది భయంతో బాల్కనీ నుంచి కిందకు దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. 

6.2 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత కూడా.. వరసగా ఆరు సార్లు భూమి కంపించింది. వీటి తీవ్రత మాత్రం 3 నుంచి 3.5 తీవ్రతగానే నమోదైంది. వరసగా వస్తున్న భూ ప్రకంపనలతో జనం ఇళ్లల్లోకి వెళ్లటానికి భయపడ్డారు. రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు టర్కీ జనం. 

ఈ భూకంపం వల్ల ఎంత నష్టం వచ్చింది.. ఎంత మంది చనిపోయారు అనేది అధికారికంగా ప్రకటించలేదు టర్కీ. నష్టం అంచనా వేస్తున్నామని.. బాధితులు అందరికీ వైద్య సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.