స్విట్జర్లాండ్లో కొత్తగా ఒలింపిక్స్ హెడ్క్వార్టర్స్
ఇది ఒలింపిక్ కమిటీ కొత్త హెడ్క్వార్టర్. ‘ఒలింపిక్స్’నే స్ఫూర్తిగా తీసుకుని కట్టిన బిల్డింగ్ ఇది. పర్యావరణానికి మేలు చేసేలా కట్టించారు. పాత బిల్డింగులను కూల్చి, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసి ఇలా కొత్త రూపమిచ్చారు. 95 శాతం మెటీరియల్స్ పాత బిల్డింగులవే. వాటిలో కొన్నింటిని యథాతధంగా వాడారు. మిగతా వాటిని రీసైకిల్ చేశారు. బిల్డింగ్లో ఏది చూసినా స్పెషలే. వర్షపు నీటిని బొట్టుబొట్టు ఆదా చేస్తూ అక్కడ మొక్కలు చెట్ల కోసం వాడేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, టాయిలెట్లకూ ఆ వర్షపు నీటినే వాడుకునే వెసులుబాట్లు కల్పించనున్నారు. కరెంట్ అవసరాలు తీర్చేందుకు బిల్డింగ్ పైకప్పుపై సోలార్ పానెళ్లు బిగించారు. రోజూ 60 ఇళ్లకు సరిపోయేంత కరెంట్ను అవి ఉత్పత్తి చేస్తాయని అధికారులు చెబుతున్నారు.
సూర్యుడి నుంచి కాంతి సహజంగా వచ్చేలా, దాని వేడి ఎక్కువగా పడకుండా దానిని నిర్మించారు. కాబట్టి పొద్దంతా సూర్యుడి వెలుగే బిల్డింగ్కు అందుతుంది. గాలి వచ్చేలా వెంటిలేషన్ను ఏర్పాటు చేశారు. 27 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో పచ్చదనం ఉండేలా చెట్లు పెంచారు. లోపలి మెట్లను ఒలింపిక్ రింగుల్లా కట్టి మరో విశిష్టతను చాటారు. 2016 మేలో మొదలైన బిల్డింగ్ ఇప్పుడు పూర్తయింది. దానికి సుమారు ₹1020 కోట్లు (14.7 కోట్ల డాలర్లు) ఖర్చు పెట్టారు. స్విట్జర్లాండ్లోని లౌసానీలో ఉందీ ఒలింపిక్స్ హెడ్క్వార్టర్స్. డెన్మార్క్కు చెందిన 3ఎక్స్ఎన్, స్విట్జర్లాండ్కు చెందిన ఇటెన్ బ్రెచ్బూల్ కంపెనీలు దీనిని నిర్మించాయి. 2018లో ఆమ్స్టర్డాంలో నిర్వహించిన వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్లో ‘ఆఫీస్ ఆఫ్ ద ఫ్యూచర్’ అవార్డు అందుకుందీ బిల్డింగ్.