కోల్కతా: ‘రేషన్ స్కామ్’ కేసులో బెంగాల్ అటవీశాఖ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ యాక్ట్ కింద మల్లిక్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఆయన ఇంట్లోనే దాదాపు 17 నుంచి 18 గంటల పాటు విచారించిన అధికారులు.. శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
మధుమేహంతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి మల్లిక్ను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ఆపై ఆయనను కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరారు. రేషన్ స్కామ్ విషయంలో పలు కీలక విషయాలపై మంత్రిని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఆయన నివాసంలో జరిపిన విచారణకు మంత్రి సహకరించలేదన్నారు. ఏ విషయం అడిగినా తన ఆరోగ్యం బాగాలేదని, సమాధానం చెప్పలేననే అన్నారని ఈడీ అధికారులు వివరించారు. కాగా, మల్లిక్కు చెందిన కోల్కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇంటితో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది.
ఇదంతా బీజేపీ కుట్ర: మల్లిక్
తాను ఎలాంటి స్కామ్కు పాల్పడలేదని, బీజేపీ తనపై కుట్ర చేస్తోందని మంత్రి మల్లిక్ ఆరోపించారు. టీఎంసీలోని మాజీ సహోద్యోగితో పాటు బీజేపీ లీడర్ సువేందు అధికారి కలిసి తనను స్కామ్లో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ గట్టి ప్లాన్ రెడీ చేసుకుందన్నారు.