- 2024 లోపు డబ్లూ హెచ్ఓ ప్రకటించే చాన్స్
ఆన్లైన్లో విచ్చలవిడిగా షాపింగ్ చేయడానికి వ్యసన సంబంధిత జబ్బుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రీసెర్చ్ కంపెనీ గార్ట్నర్ తెలిపింది. డిజిటల్ కామర్స్ను అతిగా వాడి ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకొనే వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆన్లైన్ షాపింగ్ కోసం కస్టమర్లు వెచ్చించే మొత్తం 2022 నాటికి పదిశాతం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనివల్ల కోట్ల మంది అప్పుల బారినపడతారని గార్ట్నర్ హెచ్చరించింది. కస్టమర్లు తరచూ షాపింగ్ చేసేలా చేయడానికి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్సనలైజేషన్ టెక్నాలజీ ద్వారా వారిని ఆకర్షిస్తాయి. కొనుగోళ్ల భారం పెరగడం వల్ల బాధితుడి ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అవుతుంది. డిప్రెషన్ సహా అనేక ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపై డబ్ల్యూహెచ్ఓ స్టడీ చేస్తోంది. టెక్నాలజీల వల్ల అడిక్టివ్ డిజార్డర్ల బారినపడే వారి సంఖ్య 2023 నాటికి భారీగా పెరుగుతుందని గార్ట్నర్ రిపోర్టు వివరించింది. వికలాంగ ఉద్యోగుల సంఖ్యా పెరుగుతుంది. ఉదాహరణకు రెస్టారెంట్లు ఏఐ రోబోటిక్స్ టెక్నాలజీని వాడితే వికలాంగ ఉద్యోగి కూడా ఆహార పదార్థాలు వడ్డించగలుగుతాడు. ఆర్టిఫిషియల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (ఏఈఐ) టెక్నాలజీల ద్వారా కంపెనీలు కస్టమర్ల ఆలోచనలను మార్చేసి మరింత ఎక్కువ షాపింగ్ చేయిస్తాయని గార్ట్నర్కు చెందిన డెరిల్ ప్లమర్ అన్నారు.