
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఆమె థియేటర్లో పని చేసిన వారికి ESI చెల్లించని కారణంగా ఆరు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయం ఏంటంటే.. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబు అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి చెన్నై అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ను నడిపించారు జయప్రద. అయితే.. ఆ థియేటర్లో పనిచేసే కార్మికులు జీతాల నుండి కట్ చేసిన ESI అమౌంట్ ను.. వారికి తిరిగి చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు.. జయప్రదతో పాటు మరో ముగ్గురికి రూ.5 వేల చొప్పున జరిమానాతో పాటు.. ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సీనియర్ నటి జయప్రద విషయానికి వస్తే.. ఎనభై, తొంభై దశకాల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె స్టార్ హీరోయిన్గా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె.. అందులో కూడా తన విజయ యాత్రను కొనసాగించారు.