హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తూ హక్కులను హరిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని గైడ్లైన్స్ పాటించడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీ నిధులపై కూడా కేంద్రం అజమాయిషీ చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్లో మాజీ మంత్రి పుష్పలీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నాలు చేస్తది.
400 సీట్లు వస్తే రాష్ట్రాల మరిన్ని హక్కులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటది. బీజేపీకి 200 సీట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. రాహుల్ ప్రధాని అవుతరు’’అని అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే మోదీ గ్రాఫ్ పడిపోయిందని, ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరని పుష్పలీల అన్నారు.