తెలంగాణలో తొలిసారిగా వైద్య మండలికి ఎన్నికలు

తెలంగాణలో తొలిసారిగా వైద్య మండలికి ఎన్నికలు

పద్మారావునగర్​, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ  రాష్ర్ట  వైద్య మండలికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, రాష్ర్టంలోని 48,405 వైద్య ఓటర్లు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా 13 మంది మండలి సభ్యులను ఎన్నుకోనున్నారని  రాష్ర్ట ఆరోగ్య శాఖ జాయింట్​ డైరెక్టర్​(రిటైర్డ్) డాక్టర్ జి. హనుమాండ్లు  తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ...   తెలంగాణ రాష్ర్ట వైద్య మండలి ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  సోమవారంతో నామినేషన్​ ప్రక్రియ ముగియనుందని, ఈ నెల 30 నుంచి ఓటర్లందరికీ  పోస్ట్​ ద్వారా బ్యాలెట్​ పేపర్లు పంపే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. 

ఓటు వేసిన బ్యాలెట్​ పేపర్లను తిరిగి నవంబర్​30 వ తేదీలోపు  వైద్య మండలికి  చేరుకునేలా పంపాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్​ ఒకటిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందన్నారు.  రాష్ర్ట విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్ట  వైద్య  మండలిలో వైద్యుల నమోదు ఐదేండ్లకు ఒకసారి పునరుద్ధరణకు, దేశంలోనే అత్యధిక  ఫీజులు ఉండేవన్నారు. ఎంబీబీఎస్​కు రూ . 4 వేలు,  పీజీకి రూ. 6 వేలు, సూపర్​ స్పెషాలిటీకి రూ.9 వేలు ఫీజు ఉండేదన్నారు. దీనిపై  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నమోదు రుసుంను 50 శాతం తగ్గించిందన్నారు. 65 ఏండ్లు దాటిన వైద్యులకు  పూర్తిగా మినహాయించారని తెలిపారు. వైద్యులు విజ్ఞతతో ఓటు వేయాలని  ఆయన కోరారు.