హైదరాబాద్, వెలుగు: ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ డిసెంబర్ 22 వరకు ఉంటుంది. కంపెనీ తన ఒక్కో షేరు ధరను రూ. 234-–247 మధ్య అమ్మనుంది. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లను తయారు చేయడం, అసెంబుల్ చేయడం వంటివి చేస్తోంది. ఎండ్ -టు -ఎండ్ ప్రొడక్షన్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 175 కోట్ల తాజా ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్లు, వాటాదారుల ద్వారా రూ. 300 కోట్ల విలువైన షేర్లు అమ్మకానికి ఉంటాయి.
కమల్ సేథియా, సుమన్ సేథియా, కిషోర్ సేథియా, వసుధ సేథియా, గౌరవ్ సేథియా, వినయ్ కుమార్ సేథియా, సుమిత్ సేథియాతో సహా ప్రమోటర్లు రూ. 121.1 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు. ఇతర వాటాదారులు రూ. 178.89 కోట్ల విలువైన షేర్లను సేల్ చేస్తారు. పెట్టుబడిదారులు కనీసం 60 ఈక్విటీ షేర్లు కొనాలి. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 19 న ఈ ఐపీఓ ఓపెన్లో ఉంటుంది. ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బులో 88 కోట్ల రూపాయలను అప్పులు చెల్లించడానికి ఉపయోగిస్తారు. రూ. 37.59 కోట్లను ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్, గోవాలోని వెర్నాలో ప్రస్తుత సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడానికి వాడతారు.