
- ఏడాదికి 2 కోట్ల బండ్లు అమ్మాలి.. గత 21 ఏళ్లలో కంపెనీ అమ్మింది 76 లక్షలే
- ఓటింగ్ రైట్స్ ఉన్నా, షేర్లను అమ్మడానికి కుదరదు
- మస్క్ను టెస్లాతో కట్టిపడేసే ప్రయత్నం?
న్యూఢిల్లీ: ఇప్పటివరకు నెంబర్ వన్ బిలియనీర్గా ఉన్న టెస్లా బాస్ ఎలాన్ మస్క్కు ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా మారే అవకాశం వచ్చింది. కానీ, ఈ స్థాయికి చేరుకోవడం అంత ఈజీ మాత్రం కాదు. మస్క్కు టెస్లా ఆఫర్ చేసిన శాలరీ ప్యాకేజి చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుద్ది. ఈ ప్యాకేజి కింద ట్రిలియన్ డాలర్ల (రూ.88 లక్షల కోట్ల) విలువైన షేర్లను మస్క్కు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మొత్తం పొందాలంటే, మస్క్ టెస్లా సీఈఓగా 10 సంవత్సరాలు కొనసాగాలి. అసాధ్యమైన లక్ష్యాలను చేరాలి. కంపెనీ విలువను ప్రస్తుతం ఉన్న 1.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్ల (రూ.748 లక్షల కోట్ల) కు పెంచాలి. కానీ, ఈ స్థాయిని ఇప్పటి వరకు ఏ కారు కంపెనీ చేరుకోలేదు.
షేర్లను అమ్మడం అవ్వదు..
మస్క్ శాలరీ ప్యాకేజి సాధారణ సీఈఓ జీతం కంటే చాలా డిఫరెంట్. ఆయనకు వచ్చే షేర్లను అమ్మడానికి కుదరదు. ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగితేనే షేర్లు వాస్తవంగా వస్తాయి. మొత్తం 10 సంవత్సరాల తర్వాతే పూర్తిగా పొందగలడు. ఓటింగ్ హక్కు ఉంటుంది. కానీ, అమ్మే హక్కు ఉండదు. ఈ ప్యాకేజీ కాగితంపై గొప్పగా కనిపించినా, వాస్తవంలో మస్క్ను టెస్లాకు కట్టిపడేసేలా ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. మస్క్ స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ, ఎక్స్, బోరింగ్ కంపెనీ వంటి సంస్థలతో పాటు, టెస్లాపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని అన్నారు.
ఇండియా జీడీపీ కంటే టెస్లా విలువ ఎక్కువ ?
8.5 ట్రిలియన్ డాలర్ల విలువను చేరుకోవాలని టెస్లా టార్గెట్ పెట్టుకుంది. ఇది ప్రస్తుత జర్మనీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. భారత్ జీడీపీ కంటే రెట్టింపు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ లక్ష్యానికి చేరాలంటే, ప్రతి సంవత్సరం 2 కోట్ల వెహికల్స్ అమ్మాలి. కంపెనీ గత 21 ఏళ్లలో 76 లక్షలు మాత్రమే అమ్మింది. ఆప్టిమస్ ప్రోగ్రామ్ ద్వారా 10 లక్షల హ్యుమనాయిడ్ రోబోట్స్ను, 10 లక్షల రోబోట్యాక్సీలను అమ్మింది. రోబోట్యాక్సీలు అమ్మడంలో నియంత్రణా పరమైన సమస్యలు ఎదుర్కొంది.
“ఇది శాలరీ ప్యాకేజి కాదు, చంద్రయానం” అని వెడ్బుష్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ డాన్ ఐవ్స్ కామెంట్ చేయడం గమనార్హం. మస్క్ ఎలక్ట్రిక్ కార్లు (టెస్లా), రాకెట్లు (స్పేస్ఎక్స్), టన్నెలింగ్ (బోరింగ్ కంపెనీ), ఏఐ (ఎక్స్ఏఐ), సోషల్ మీడియా (ఎక్స్) వంటి కీలక రంగాల్లో వ్యాపారం చేస్తున్నారు. ఆయన బిజినెస్లకు టెస్లాను ఆర్థిక వెన్నెముకగా మార్చాలని ఈ ఎలక్ట్రిక్ కంపెనీ షేర్హోల్డర్లు భావిస్తున్నారు.
కొంతమంది మస్క్పై గుస్సా
కొంతమంది షేర్హోల్డర్లు మస్క్ రాజకీయ వ్యాఖ్యలు, ట్రంప్తో బహిరంగ అనుబంధం వల్ల టెస్లా ప్రతిష్ట దెబ్బతిందని భావిస్తున్నారు. రాయిటర్స్ ప్రకారం, ఇది స్టాక్పై ప్రభావం చూపింది. మరోవైపు బీవైడీ, ఫోర్డ్, జీఎం వంటి సంస్థల నుంచి పోటీ పెరుగుతోంది. మస్క్ను "ఆబ్సెంట్ సీఈఓ" అని టెస్లాలో మూడో అతిపెద్ద వ్యక్తిగత షేర్హోల్డర్ లియో కోగున్ విమర్శించడం గమనార్హం. ఫోర్బ్స్ ప్రకారం, ప్రస్తుతం మస్క్ నికర సంపద 437.8 బిలియన్ డాలర్లు (రూ.38 లక్షల కోట్లు) గా ఉంది. తాజాగా ప్రతిపాదించిన శాలరీ ప్యాకేజికి ఆమోదం లభిస్తే చరిత్రలో తొలి ట్రిలియనీర్గా నిలుస్తారు. కానీ, టెస్లా ఫ్యూచర్ ఒకే వ్యక్తిపై ఆధారపడకూడదని నిపుణులు చెబుతున్నారు.