
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. "గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి నేను చేసిన కొన్ని పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నా. ఆ పోస్టులు చాలా దూరం వెళ్లాయి" అని మస్క్ బుధవారం తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు.'బిగ్ బ్యూటిపుల్ బిల్లు' విషయంలో కొంతకాలంగా ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరిగింది. ఈ బిల్లుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని మస్క్ ఆరోపించారు. తనకు అనుకూలంగా లేకపోవడం వల్లే బిల్లుపై మస్క్ ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
ఇలా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సెక్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టిన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బయట పెట్టలేదని తెలిపాడు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. అంతేగాక.. తన సపోర్ట్ లేకపోయి ఉంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అసలు గెలిచేవారే కాదన్నారు.
వ్యాపారంపై దెబ్బ పడటంతోనే..!
మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టంచేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ ఒక్క వార్నింగ్ తో మస్క్ కు చెందిన టెస్లా షేర్లు దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయని వార్తలు వచ్చాయి. మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ కూడా తన కొడుకు ఒత్తిడి కారణంగానే ట్రంప్ పట్ల ఇలా ప్రవర్తించాడని వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలను మరికొందరు కూడా తప్పుబట్టారు. దాంతో ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును ఆయన తొలగించారు. దానికి తోడు తాజాగా చేసిన పోస్ట్ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.