
- అదొక చెత్త బిల్లు: ఎలాన్ మస్క్
- ఆ బిల్లుతో అమెరికన్లపై అధిక భారం పడుతుందని కామెంట్
- ట్రంప్ నిర్ణయం మారదని వైట్ హౌస్ కౌంటర్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకురానున్న'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సారి విమర్శలు గుప్పించారు. అది ఒక చెత్త బిల్లు అని.. దాని వల్ల అమెరికన్లపై అధిక భారం పడనుందని తెలిపారు. దేశ ద్రవ్యలోటు మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. " నన్ను క్షమించండి. 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' గురించి మాట్లాడకుండా నేనిక ఊరుకోలేను. ఇది వృథా ఖర్చుతో కూడిన కాంగ్రెస్ బిల్లు. నిజంగా చాలా దారుణమైంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మన దేశ బడ్జెట్ లోటును 2.5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుంది. అమెరికన్లపై భరించలేని రుణ భారాన్ని మోపుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) బృందం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి కష్టపడుతుంటే.. ఈ బిల్లు దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బిల్లుకు ఓటు వేసినవారు సిగ్గుపడాలి. మీరు తప్పు చేశారని మీకూ తెలుసు!
అమెరికాను దివాలా నుంచి కాపాడాలంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి" అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే, మస్క్ విమర్శలను వైట్ హౌస్ చాలా లైట్ తీసుకుంది. "ఈ బిల్లు గురించి ఎలాన్ మస్క్ అభిప్రాయమేంటో అధ్యక్షుడు ట్రంప్ కు తెలుసు. కానీ, ఆయన అభిప్రాయం అధ్యక్షుడి నిర్ణయాన్ని మార్చదు. ఇదొక గొప్ప బిల్లు. దీనిని ట్రంప్ కొనసాగిస్తారు" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు.
అయోధ్యలో మస్క్ తండ్రి ఎరోల్ మస్క్
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించారు. తన కుమార్తె అలెగ్జాండ్రా మస్క్తో కలిసి రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని హనుమాన్గర్హి మందిరాన్ని కూడా సందర్శించారు. అనంతరం ఎరోల్ మస్క్ మాట్లాడుతూ.."భారతదేశం అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి ప్రజలు ప్రేమ, దయతో ఉంటారు. అమెరికాలో చాలా మంది భారతీయులు ఉన్నారు. కాబట్టి నాకూ కొంచెం భారతీయ సంస్కృతి తెలుసు" అని పేర్కొన్నారు. ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా ఎరోల్ మస్క్ జూన్ 1వ తేదీన ఢిల్లీ చేరుకున్నారు.