వెలుగు బిజినెస్ డెస్క్: ఓవైపు ఉద్యోగుల వలసలతో ప్రైవేటు బ్యాంకులు సతమతమవుతుంటే, మరో వైపు కొత్తగా కొలువులలో చేరాలనుకునే వారు సర్కారీ బ్యాంకులనే ఇష్టపడుతున్నారు. పనిచేసే చోట వత్తిడి తక్కువగా ఉండాలని, జీతం మాత్రం ఒకింత ఎక్కువగా ఉండాలని జాబ్స్లో చేరాలనుకునే కేండిడేట్లు ఆలోచిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులలో 34 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు వలసపోతున్నారు. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగుల వలస 5 శాతం మాత్రమే.
ఎస్బీఐలో వలస 3 శాతమే...
దేశంలోనే అతి పెద్ద బ్యాంకయిన స్టేట్ బ్యాంక్లో ఉద్యోగుల వలస (రిజిగ్నేషన్లు, రిటైర్మెంట్లు, వీఆర్ఎస్) కలిపి కేవలం మూడు శాతమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొత్తం 2.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మెరుగ్గా ఉండటంతోపాటు, రెగ్యులర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్మెంట్ చొరవ వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగుల వలసను అడ్డుకోగలుగుతున్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులలో చేరే ఉద్యోగులు అప్పటికే తమ జాబ్ విషయంలో ఒక క్లారిటీతో ఉంటారని, రిక్రూట్మెంట్ ప్రాసెసే దానికి కారణమని పేర్కొన్నారు.
ప్రైవేటు రంగ బ్యాంకులలో పద్ధతులు ఇలా ఉండవని చెప్పారు. అంతేకాదని, తమ బ్యాంకులోని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రెడేషన్కోసం ట్రెయినింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని, ప్రైవేటు బ్యాంకులు ఈ విషయంలో వెనకబడ్డాయని వివరించారు. గత ఫైనాన్షియల్ ఇయర్లో కెనరా బ్యాంకులో ఉద్యోగుల వలస 4.26 శాతమైతే, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులలో అది 1 శాతం లోపే. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ఎంట్రీ, మిడ్లెవల్ జాబ్స్లో జీతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే మెరుగ్గా ఉంటున్నాయి.
కొత్త ఆఫీసర్ జీతం 60-80 వేలు...
ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొత్తగా జాయినయే ఆఫీసర్కు నెలకు రూ. 60 నుంచి 80 వేల దాకా జీతం వస్తుందని, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులలోనైతే ఇందులో 30 –40 శాతమే జీతంగా ఉంటుందని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు సీఈఓ వెల్లడించారు. మిడ్లెవెల్దాకా జీతాలు ఇలాగే కొనసాగుతాయని, కానీ ఆ తర్వాత లెవెల్స్లో మాత్రం ప్రైవేటు రంగ ఉద్యోగులకే ఎక్కువ జీతాలు ఉంటాయని పేర్కొన్నారు. హౌసింగ్, పెన్షన్, ఈజీ వర్క్ హవర్స్..జీతాలు మాత్రమే కాకుండా, హౌసింగ్, పెన్షన్, ఈజీ వర్క్ హవర్స్ వంటి సదుపాయాలు కూడా ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకులను అట్టేపెట్టుకుని ఉండటానికి మరో ప్రధాన కారణం.
పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకు బ్రాంచీలు..
గత రెండేళ్లలో చూస్తే దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకులు తమ బ్రాంచీలను పెంచుతున్నాయి. దీంతో ఉద్యోగులకు డిమాండ్ పెరిగిందని, ఉద్యోగుల వలస బెడద ఎక్కువడానికి ఇదే ప్రధానమైన కారణమని యాక్సిస్ బ్యాంక్ హెచ్ ఆర్ హెడ్ రాజ్కమల్ వెంపటి చెప్పారు. ప్రైవేటు బ్యాంకులలోని 70 శాతం మంది ఫ్రంట్లైన్ ఉద్యోగులు ఒక బ్యాంకు నుంచి మరో దానికి మారుతున్నారని అన్నారు. సేల్స్, సర్వీస్, కాల్ సెంటర్, కలెక్షన్స్ వంటి ఉద్యోగాలలో వలస ఎక్కువగా ఉందని, మిడ్లెవెల్, సీనియర్ లెవెల్లో వలసలు తక్కువేనని కొటక్ మహీంద్రా బ్యాంక్ స్పోక్స్పర్సన్ వెల్లడించారు. ప్రైవేటు బ్యాంకులలోని వర్క్కల్చర్ కొంత కఠినంగా ఉండటం వల్లే ఉద్యోగుల వలసలు ఎక్కువవుతున్నాయని హెచ్ఆర్ కన్సల్టెంట్లు అభిప్రాయపడుతున్నారు.