బ్రిస్బేన్: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ జూలు విదిల్చింది. కెప్టెన్ జోస్ బట్లర్ (47 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 73), అలెక్స్ హేల్స్ (40 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. మంగళవారం జరిగిన సూపర్–12, గ్రూప్–1 లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 20 రన్స్ తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. దీంతో ఇంగ్లిష్ జట్టు 5 పాయింట్లతో రెండో స్థానంలోకి రాగా, తక్కువ రన్రేట్ ఉన్న ఆస్ట్రేలియా (5 పాయింట్లు) మూడో ప్లేస్కు పడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. బట్లర్, హేల్స్ తొలి వికెట్కు 62 బాల్స్లో 81 రన్స్ జోడించారు. మిడిల్, డెత్ ఓవర్స్లో కివీస్ పేసర్లు సౌథీ (1/43), ఫెర్గూసన్ (2/45) చెలరేగినా.. ఇంగ్లండ్ మంచి టార్గెట్నే నిర్దేశించింది. లివింగ్స్టోన్ (20) కూడా రాణించాడు. శాంట్నర్, ఇష్ సోధీ చెరో వికెట్ తీశారు.
ఫిలిప్స్ పోరాటం వృథా
180 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో ఓవర్లన్నీ ఆడిన న్యూజిలాండ్ 159/6 స్కోరుకు మాత్రమే పరిమితమై ఓడింది. గ్లెన్ ఫిలిప్స్ (36 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62), కెప్టెన్ విలియమ్సన్ (40 బాల్స్లో 3 ఫోర్లతో 40) మాత్రమే పోరాడారు. ఇంగ్లిష్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడటంతో 28 రన్స్కే ఫిన్ అలెన్ (16), కాన్వే (3) ఔటయ్యారు. ఈ దశలో ఫిలిప్స్, విలియమ్సన్ మూడో వికెట్కు 91 రన్స్ జోడించారు. అయితే మిడిలార్డర్లో నీషమ్ (6), మిచెల్ (3) విఫలంకావడం, చివర్లో శాంట్నర్ (16 నాటౌట్), సోధీ (6 నాటౌట్)ని ఇంగ్లిష్ బౌలర్లు అడ్డుకోవడంతో కివీస్కు ఓటమి తప్పలేదు. వోక్స్, కరన్ చెరో రెండు వికెట్లు తీశారు. బట్లర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.