- ఇంగ్లండ్ x న్యూజిలాండ్ మ్యాచ్
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
అబుదాబి: టీ20 వరల్డ్కప్ చివరి దశకు వచ్చేసింది. ఫేవరెట్ హోదాలో బరిలోకి దిగుతున్నప్పటికీ గాయాలతో కీలక ప్లేయర్ల సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ బుధవారం రాత్రి ఇక్కడ జరిగే ఫస్ట్ సెమీఫైనల్లో నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్తో అమీతుమీకి రెడీ అయింది. వన్డే చాంపియన్ అయిన ఇంగ్లండ్.. టీ20 వరల్డ్కప్ కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ తొలి వరల్డ్కప్ను ఖాతాలో వేసుకోవాలని కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్ ఆశిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని ఇంగ్లిష్ టీమ్ అందుకు తగ్గట్టుగానే ఆడుతూ సూపర్12 గ్రూప్1లో టాప్ ప్లేస్తో నాకౌట్కు వచ్చింది. కానీ, చివరి గ్రూప్ మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆ జట్టు గాయాలతో ఫామ్లో ఉన్న ఓపెనర్ జేసన్ రాయ్, పేసర్ తైమల్ మిల్స్ సేవలు కోల్పోయి కాస్త డీలా పడింది. అయితే, మరో ఓపెనర్ బట్లర్ సూపర్ ఫామ్లో ఉండగా, మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తున్నారు. బౌలింగ్లో మాత్రం స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్పై మరింత భారం పడనుంది. కివీస్ బ్యాటర్లు స్పిన్లో వీక్ కాబట్టి ఈ ఇద్దరిపై ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ కౌంట్ రూపంలో ట్రోఫీ చేజార్చుకున్న న్యూజిలాండ్ ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ గెలిచింది. ఇప్పుడు టీ20 కప్ మీద కూడా కన్నేసింది. ఈ టోర్నీలో బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉన్న టీమ్ కివీసే. కొత్త బాల్తో పేసర్లు బౌల్ట్, సౌథీ, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఇష్ సోధీ, శాంట్నర్ అదరగొడుతున్నారు. టోర్నీ సాగుతున్న కొద్దీ బ్యాటర్లు సైతం మెరుగయ్యారు. ఓపెనర్లు గప్టిల్, డారిల్తో పాటు కెప్టెన్ కేన్ ఫామ్లో ఉండటం కివీస్కు ప్లస్ పాయింట్.