కోయిల్​సాగర్​ కింద మినీ రిజర్వాయర్ .. మన్యంకొండ వద్ద నిర్మించేందుకు ప్లాన్

కోయిల్​సాగర్​ కింద మినీ రిజర్వాయర్ .. మన్యంకొండ వద్ద నిర్మించేందుకు ప్లాన్
  • దేవరకద్ర అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు నింపాలని ప్రపోజల్
  • పైపులైన్​ ద్వారా మహబూబ్​నగర్​ మండలంలో చెరువులు నింపేందుకు మరో ప్రతిపాదన
  • సర్వేలు చేసి సాధ్యసాధ్యాలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్న ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు: కోయిల్ సాగర్​ ప్రాజెక్టు ద్వారా మరింత ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సోర్స్​ ఆధారంగా ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి అదనంగా రెండున్నర టీఎంసీల మేర నీటిని వినియోగించుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారు. అందులో ఒకటిన్నర టీఎంసీ కెపాపిటీతో మినీ రిర్వాయర్, మరో టీఎంసీ నీటిని ప్రత్యేక పైపులైన్​ ద్వారా చెరువులు నింపేందుకు మహబూబ్​నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధించి త్వరలో సర్వే చేయనున్నారు.

మన్యంకొండ వద్ద రిజర్వాయర్..

కోయిల్​సాగర్​ ఆధారంగా మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన మన్యంకొండ గుట్టల ప్రాంతంలో మినీ రిజర్వాయర్  ఏర్పాటుకు ఎమ్మెల్యే జీఎంఆర్​ ప్రతిపాదనలు చేశారు. చౌదరిపల్లి సమీపంలో లేదంటే మన్యంకొండ బ్యాక్ సైడ్​లో ఈ రిజర్వాయర్​ను నిర్మించే అవకాశం ఉంది. దాదాపు 1.5 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్​ను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. కెనాల్​ లేదా పైప్​లైన్​ సిస్టమ్​ ద్వారా ఈ రిజర్వాయర్​ను నీటితో నింపేందుకు కసరత్తు జరుగుతోంది. దీనిపై పూర్తి ప్రతిపాదనలను ఎమ్మెల్యే జీఎంఆర్​ ఇటీవల ఇరిగేషన్​ శాఖకు అందించగా.. వారు సానుకూలంగా స్పందించారు. అన్ని కురిదితే త్వరలో ఈ రిజర్వాయర్​ నిర్మాణానికి సంబంధించిన జీవోను విడుదల చేయనున్నారు. 

ఈ రిజర్వాయర్​ నిర్మాణం ద్వారా అడ్డాకుల, మూసాపేట, దేవరకద్ర మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపనున్నారు. 12 గ్రామాలను కలుపుతూ ఈ చెరువులు ఉండడంతో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది. దీంతో యాసంగి పంటలకు సాగునీటికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. దీనికితోడు గుట్టల మధ్యలో రిజర్వాయర్​ నిర్మిస్తే పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో దాదాపు 15 ఎకరాల నుంచి 20 ఎకరాల్లో ప్లెయిన్​​ ఏరియా ఉండడంతో టూరిజం డెవలప్​మెంట్​కు దోహపడనుంది. 

పాలమూరు చెరువులు నింపేందుకు..

మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలో ప్రతి యాసంగి సీజన్​లో రైతులు పంటలు కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచే చెరువుల్లో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో గ్రౌండ్​ వాటర్​ కూడా పడిపోయింది. దీంతో ఈ యాసంగిలో మండలంలోని కొందరు రైతులు పంటలను పశువులకు వదిలేశారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే వైఎస్ఆర్​ కోయిల్​సాగర్​ ద్వారా పాలమూరు చెరువులను నింపేందుకు ఇరిగేషన్​ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.

 20 చెరువులను కృష్ణా జలాలతో నింపాలని కోరారు. ఇందుకుగాను కోయిల్​సాగర్​ నుంచి ప్రత్యేక పైప్​లైన్​ తీసుకొచ్చి చెరువులను నింపే ప్రయత్నం చేయాలని ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులకు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆఫీసర్లు త్వరలో సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే చాన్స్​ ఉంది.

ఇదీ కోయిల్​సాగర్​ పరిస్థితి..

కోయిల్​సాగర్​ ప్రాజెక్టు 2.27 టీఎంసీల కెపాసిటీతో 1966లో అందుబాటులోకి వచ్చింది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించేలా డిజైన్​ చేశారు. అయితే 2004లో కాంగ్రెస్​ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎఎస్సార్​​ఈ లిఫ్ట్​ను జలయజ్ఞం కిందకు చేర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 50,250 ఎకరాలకు సాగునీటిని అందించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. రూ.360.18 కోట్లతో మెయిన్​ కెనాల్స్, సబ్​ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలను డెవలప్​ చేసే పనులు చేపట్టారు.

 2014 వరకు రూ.336.29 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పెండింగ్​లో ఉన్నాయి. ప్రస్తుతం దీని కింద 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. జూరాల బ్యాక్​ వాటర్​ ఎడమ వైపు నుంచి కోయిల్​సాగర్​కు ప్రత్యేకంగా కెనాల్​ ఉండగా.. ఈ కెనాల్​ ఆధారంగా జూరాలకు వరదల సమయంలో పెద్ద మొత్తంలో కృష్ణా జలాలను కోయిల్​సాగర్​కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కొత్తగా ప్రతిపాదించిన రిజర్వాయర్​కు తరలించాలని ప్లాన్​ చేస్తున్నారు.