పుడమిని కాపాడుకుందాం..ఎన్విరాన్​మెంట్​ డే సందర్భంగా మొక్కలు నాటిన ప్రధాని

పుడమిని కాపాడుకుందాం..ఎన్విరాన్​మెంట్​ డే సందర్భంగా మొక్కలు నాటిన ప్రధాని
  • భూ గ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిద్దాం: మోదీ

న్యూ ఢిల్లీ:  కలిసికట్టుగా కృషిచేసి పుడమిని పరిరక్షించుకుందామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భూగ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిద్దామని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘ఏక్​ పేడ్ ​మా కే నామ్’​ఉద్యమాన్ని విస్తరించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని భగవాన్​ మహావీర్​ వనస్థలి పార్కులో  గురువారం ఓ మొక్కను నాటారు. 

 ఆరావళి శ్రేణిని తిరిగి అడవులుగా మార్చే ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’కు  శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ద్వారా 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని  చెప్పారు. పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చదనాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్​ అని,  ఐదేండ్లుగా ఇందుకోసం భారత్​ కృషి చేస్తోందన్నారు. 

సిందూర మొక్కను నాటిన మోదీ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సిందూర మొక్కను నాటారు.  బంగ్లాదేశ్‌‌‌‌ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్‌‌‌‌తో భారత్‌‌‌‌ చేసిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మహిళా బృందం ఈ మొక్కను మోదీకి బహూకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్‌‌‌‌’ లో మోదీ పోస్ట్​ చేశారు.

 ‘‘నేను ఇటీవల గుజరాత్​లోని కచ్​ను సందర్శించినప్పుడు ఆ మహిళ బృందం ఈ మొక్కను నాకు ఇచ్చింది. దీన్ని పర్యావరణ దినోత్సవం సందర్భంగా  నాటే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం” అని పేర్కొన్నారు.