- గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం
- కొత్త వాటికి అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఇకపై అన్ని రకాల కార్లలో ప్రతి సీటుకూ సీటు బెల్ట్ తప్పనిసరి కానుంది. ఎనిమిది సీట్ల కార్లలో కూడా త్వరలో సీట్ బెల్ట్ కంపల్సరీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర రోడ్డు, రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయగా, అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇకపై తయారయ్యే అన్ని కార్లలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్ బెల్ట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాహనదారుల సేఫ్టీ కోసం కేంద్ర ప్రభుత్వం పలు గైడ్లైన్స్ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే వెహికల్స్ తయారీ సమయంలోనే ప్రమాదాలను నివారించే సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయా కంపెనీలకు సూచిస్తోంది. దీంతో ఇకపై త్రీ పాయింట్ సీట్ బెల్ట్ కూడా ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రస్తుతం కార్లలో ముందు సీటులో ఇద్దరు, వెనుక సీటులో ఇద్దరికి మాత్రమే సీటు బెల్ట్ ధరించేందుకు వీలు ఉంది. వెనుక సీటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి సీటు బెల్ట్ పెట్టుకునే ఏర్పాటు లేదు. ఇకపై మధ్య సీటులో కూర్చునే వారికి కూడా సీట్ బెల్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రూల్ అమలు కావాలంటే ఆటోమొబైల్ సంస్థలు కార్లలో త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.