ఓవైపు సీనియర్ల గైర్హాజరీ.. మరోవైపు బౌలర్ల ఫామ్లేమి.. ఈ నేపథ్యంలో ఇండియా టీమ్ రెండో టీ20 మ్యాచ్కు రెడీ అయ్యింది..! తొలి మ్యాచ్ ఓటమితో వరల్డ్ రికార్డును దూరం చేసుకున్న టీమిండియా.. ఇందులో గెలిచి లెక్క సరి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది..! బ్యాటర్లందరూ ఐపీఎల్ ఫామ్ను చూపెడుతున్నా.. బౌలర్ల వైఫల్యం.. ఫ్యూచర్ కెప్టెన్ రిషబ్ పంత్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది..! దీంతో కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వాలా? పాత వాళ్లనే కొనసాగించాలా? అన్న డైలమాను ఎదుర్కొంటున్న పంత్ కెప్టెన్సీకి కూడా ఈ మ్యాచ్ సవాల్గా మారింది..! ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి!
కటక్ : ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఓటమితో టీమిండియా కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తుంటే.. విజయంతో సఫారీలు ఆధిక్యం కోసం ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరుజట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ప్రొటీస్ టీమ్ 1–0 లీడ్లో ఉంది. రెండో టీ20 కోసం టీమిండియా పక్కా లెక్కలతో బరిలోకి దిగుతున్నది. బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా బౌలర్లు నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనల్ ఎలెవన్ను మార్చే చాన్స్ కనిపించడం లేదు. కానీ తొలి మ్యాచ్లో 212 రన్స్ను కాపాడలేకపోవడంతో కొత్త బౌలర్లు అర్షదీప్, ఉమ్రాన్కు చాన్స్ ఇవ్వాలా? వద్దా? అన్న ఆలోచన మొదలైంది. మరి దీనిపై మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆల్రౌండర్గా హార్దిక్ బ్యాట్తో రాణించినా, బౌలింగ్లో నిరాశపర్చడం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. ఒకే ఓవర్లో 18 రన్స్ ఇవ్వడంతో అతనిపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. డెత్ ఓవర్స్లో భువనేశ్వర్, హర్షల్ ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరూ గాడిలో పడకపోతే ఈ మ్యాచ్లోనూ ఇబ్బందులు తప్పవు. ఆవేశ్ ఖాన్ ఆకట్టుకున్నా.. సరైన టైమ్లో వికెట్లు తీయలేకపోతున్నాడు. స్పిన్నర్లుగా అక్షర్, చహల్ తన మ్యాజిక్ చూపెట్టాలి. రుతురాజ్, ఇషాన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. వన్డౌన్లో శ్రేయస్ మరింతగా రాణించాలి. పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ మరి కాస్త పెరగాలి. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే ఆఖరి మూడు మ్యాచ్లు గెలవడం అంత ఈజీ కాదు.
ఆధిక్యంపై సౌతాఫ్రికా ఫోకస్
మరోవైపు తొలి మ్యాచ్ విజయం ఇచ్చిన కిక్తో సఫారీలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆ జోష్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం గత మ్యాచ్ ఫైనల్ ఎలెవన్ను యథావిధిగా దించుతున్నారు. కొవిడ్ కారణంగా మార్క్రమ్ ఈ మ్యాచ్కూ అందుబాటులో లేడు. ఓపెనింగ్లో డికాక్ మంచి ఆరంభాన్నిస్తున్నా కెప్టెన్ బవూమ గాడిలో పడాలి. అయితే ప్రిటోరియస్, డసెన్, మిల్లర్ ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్లోనూ ఇండియన్ బౌలర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఈ ముగ్గురు సఫారీ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలవడం అతిపెద్ద సానుకూలాంశం. తొలి మ్యాచ్లో విఫలమైన బౌలర్లందరూ ఈ మ్యాచ్లో రాణించాలని చూస్తున్నారు. పేసర్లు నోర్జ్, పార్నెల్, రబాడతో పాటు స్పిన్నర్లు శంసి, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్ రన్స్ను కట్టడి చేయడంపై దృష్టి సారించారు.
జట్లు (అంచనా)
ఇండియా : ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, పంత్ (కెప్టెన్), హార్దిక్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, చహల్.
సౌతాఫ్రికా : డికాక్, బవూమ (కెప్టెన్), డసెన్, మిల్లర్, స్టబ్స్, ప్రిటోరియస్, పార్నెల్, రబాడ, ఎంగిడి / కేశవ్ మహారాజ్, నోర్జ్, షంసి.