- ఎమర్జెన్సీ క్రూడాయిల్ నిల్వలు బయటకు తీస్తున్నరు
- ప్రొడక్షన్ పెంచాలంటే ఓపెక్ వింటలే
- ఆయిల్ రేట్లు తగ్గించేందుకే ఈ నిర్ణయం
- కొత్త ప్లాన్తో ముందుకొచ్చిన అమెరికా
- అంగీకరించిన ఇండియా, చైనా, జపాన్
- మన దగ్గర 50 లక్షల బ్యారెల్స్ బయటకు
న్యూఢిల్లీ: పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు కళ్లెం వేసేందుకు ఇండియా, యూఎస్, జపాన్లు ముందుకొచ్చాయి. క్రూడాయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు తమ ప్రొడక్షన్ను తగ్గిస్తుండడంతో ఆయిల్ ధరలు రికార్డ్ లెవెల్స్ను టచ్ చేస్తున్నాయి. పెట్రోలియంను ఎక్కువగా వాడుతున్న ఇండియా, యూఎస్, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రొడక్షన్ పెంచాలని కోరుతున్నా ఓపెక్, ఓపెక్ ప్లస్ దేశాలు పట్టించుకోవట్లే. దీంతో ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవాలని, ఎమర్జెన్సీ కోసం దాచుకున్న నిల్వలను బయటకు తీసి ఉపయోగించుకోవాలని అమెరికా నిర్ణయించింది. రేట్లను కంట్రోల్ చేయడానికి మీరు కూడా ఇదే ఫాలో కావాలని ఇండియా, చైనా, జపాన్వంటి దేశాలకు సూచించింది. ఈ సూచనను ఇండియా సహా మిగతా దేశాలన్నీ అంగీకరించాయి. ఈ విషయంలో అమెరికా వెంటే నడవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రూడాయిల్ నిల్వల నుంచి 50 లక్షల బ్యారెల్స్ను బయటకు తీయడానికి రెడీ అవుతోంది. ఇలా ఆయిల్ ధరలు దిగిరావడం కోసం మనం ఎప్పుడూ ఎమర్జెన్సీ నిల్వలను వాడుకోలేదు. ప్రస్తుతం దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలలోని మూడు ప్రాంతాల్లో 53.3 లక్షల టన్నుల బ్యారెల్స్ లేదా 380 లక్షల బ్యారెల్స్ క్రూడాయిల్ను నిల్వ చేస్తున్నాం. మరో 7–10 రోజుల్లో 50 లక్షల బ్యారెల్స్ ఆయిల్ను బయటకు తీస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ క్రూడాయిల్ను మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) ల రిఫైనరీలకు అమ్ముతారు.
ప్రొడక్షన్ను ఓపెక్, ఓపెక్ ప్లస్ పెంచట్లే
క్రూడాయిల్ ప్రొడక్షన్ను పెంచాలని వివిధ దేశాలు కోరుతున్నప్పటికీ ఓపెక్ దేశాలు పట్టించుకోవడంలేదు. ఓపెక్ ప్లస్ దేశాలు తమ ప్రొడక్షన్ను తగ్గించడంతో, సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ ఇంపోర్ట్స్ను మూడో వంతు మేర ప్రభుత్వం తగ్గించింది. ఇతర దేశాలతో పాటే స్ట్రాటజిక్ రిజర్వ్ల నుంచి క్రూడాయిల్ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నామని అధికారులు చెప్పారు. కానీ, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని వారు వెల్లడించలేదు. అమెరికా అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత మన దేశంలో క్రూడాయిల్ను బయటకు తీస్తారని అంచనా. ఓపెక్, ఓపెక్ ప్లస్ దేశాలు రోజుకు 4 లక్షల బ్యారెల్స్ చొప్పున ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ, ఎకానమీ రికవరీ అవుతుండడంతో డిమాండ్కు తగ్గ సప్లయ్ జరగడంలేదు. ఈ ఏడాది అక్టోబర్లో బ్యారెల్ క్రూడాయిల్ 86.40 డాలర్లను టచ్ చేసింది. ప్రస్తుతం 79 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డ్ లెవెల్స్కు చేరుకుంటున్నాయి.
అమెరికాలో 5 కోట్ల బ్యారెళ్లు..
ఎమర్జెన్సీ నిల్వల నుంచి 5 కోట్ల బ్యారెళ్లు బయటకు తీయనున్నట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ రెండో వారం నుంచి నెలాఖరులోగా ఈ క్రూడాయిల్ బ్యారెళ్లు మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపాయి. ఇందులో 3.2 కోట్ల బ్యారెళ్లు ఎమర్జెన్సీ రిజర్వుల నుంచి, మిగతా బ్యారెళ్లు గతంలో అమ్మకాలకు కేటాయించనవని చెప్పారు. ఈమేరకు వైట్హౌస్ మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అయితే, ఈ ప్రకటనపై ఓపెక్ ప్లస్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమర్జెన్సీ నిల్వలు బయటకు తీయాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. క్రూడాయిల్ ప్రొడక్షన్ పెంచాలన్న ప్రతిపాదనలను
వెనక్కి తీసుకుంటామని, ప్రొడక్షన్ పెంచబోమని హెచ్చరించాయి.
యూఎస్ వెంటే ఇండియా..
క్రూడాయిల్ ధరలు ఎక్కువగా ఉండడంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతోందని అమెరికా, ఇండియాలు భావిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ల రికవరీ లేట్ అవుతోందని అభిప్రాయపడు తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ లెవెల్స్ను టచ్ చేయడంతో ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించింది కూడా. దీంతో ప్రభుత్వ రెవెన్యూ రూ.60 వేల కోట్లు తగ్గుతుందని అంచనా. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరింది. ఇండియాకు విశాఖపట్నంలో 13.3 లక్షల టన్నుల క్రూడాయిల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మంగుళూరులో 15 లక్షల టన్నుల కెపాసిటీ, పాడూర్ (కర్నాటక) లో 25 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న క్రూడాయిల్ స్టోరేజిలు ఉన్నాయి. ఇతర దేశాలతో కలుపుకొని రిజర్వ్ల నుంచి క్రూడాయిల్ను బయటకు తీస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా రు. తేదీలపై కసరత్తు జరుగుతోందని అన్నారు. కాగా, యూఎస్ 72.7 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ను, జపాన్ 17.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ను ఎమర్జెన్సీ అవసరాలకు కోసం నిల్వ చేసి ఉంచుతున్నాయి.