న్యూయార్క్: కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఆపరేషన్.. క్యాన్సర్ బారిన పడినోళ్లకు చేసే ట్రీట్మెంట్ పద్ధతులివి. అవి చేసినా పూర్తిగా నయమవుతుందన్న గ్యారెంటీ లేదు. ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ల బాధ కూడా అంతా ఇంతా కాదు. ఆ బాధలేవీ లేకుండా క్యాన్సర్ను ఇమ్యునో థెరపీ గాయబ్ చేసేసింది. పేషెంట్లకు కొండంత ఊరటనిచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ మెమోరియల్ స్లోవన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు.. 18 మంది రెక్టల్ (మలద్వార) క్యాన్సర్ పేషెంట్లకు ‘డోస్టార్లిమాబ్’ అనే ఇంజెక్షన్ను ఇచ్చి టెస్ట్ చేశారు. 3 వారాలకో డోసు చొప్పున 6 నెలల పాటు ట్రయల్స్ చేశారు. ఆ తర్వాత ఆ పేషెంట్లకు క్యాన్సర్ టెస్ట్ చేస్తే.. దాని ఆనవాళ్లేవీ కనిపించకుండా పోయాయి. ఫిజికల్ ఎగ్జామ్, ఎండోస్కోపీ, పోజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పీఈటీ) స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేసినా క్యాన్సర్ మూలాలు కనిపించలేదు. ఎటువంటి చికిత్స అవసరం లేని స్థితిలో వారంతా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు.
డోస్టార్లిమాబ్ ఔషధంలో ల్యాబ్ లో రూపొందిచిన అణువులు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించాక యాంటీబాడీలకు డూప్లికేట్ గా పనిచేస్తూ క్యాన్సర్ కణాల భరతం పడతాయి. ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అని ఈ ట్రయల్స్ లో పాలుపంచుకున్న డాక్టర్ లూయిస్ ఏ డియాజ్ వెల్లడించారు. ఓ ఔషధంతో క్యాన్సర్ మటుమాయం అవడం ఇదే తొలిసారి అన్నారు. ఈ ట్రయల్స్ను మరింత మంది పేషెంట్లపై పెద్ద సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.