
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. తెహ్రాన్లోని మోనిరియే ప్రాంతంలో.. ఖమేనీ నివాసం సమీపంలో వైమానిక దాడులు జరిగాయి. ఆ పేలుడుకు సంబంధించిన వీడియోలను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజాము వరకూ భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ ప్రెసిడెంట్ ఆఫీస్ దగ్గర్లో కూడా వైమానిక దాడులు జరిగాయని సదరు మీడియా సంస్థ తెలిపింది. తెహ్రాన్లోని మెహ్రాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఎయిర్ బేస్ సమీపంలో కూడా భారీ పేలుడు సంభవించింది.
#BREAKING A video published by Iranian media purportedly shows intense air defense activities in Tehran's Moniriyeh, near the residence of Iran's Supreme Leader Ali Khamenei and the country's presidential office. pic.twitter.com/kxgVDRK67v
— Iran International English (@IranIntl_En) June 13, 2025
ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం రెండు దఫాలుగా ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో న్యూక్లియర్ ప్లాంట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ మహ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామీ సహా పలువురు టాప్ మిలిటరీ కమాండర్స్, ఇద్దరు సైంటిస్టులు మృతి చెందారు.
శుక్రవారం వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. తమ ప్రతీకార దాడి మొదలైందని హెచ్చరించింది. కాగా, సలామీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ధ్రువీకరించింది. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంక్ కలిగిన ఆఫీసర్ భాఘేరి. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతిచెందిన వ్యక్తుల్లో బాఘేరీ రెండో కీలక వ్యక్తిగా నిలిచారు. 1980లో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలు, క్షిపణి కేంద్రాలపై జరిగిన పెద్దదాడి ఇదే కావడం గమనార్హం.
#BREAKING A video shared by Iranian media purportedly shows a huge explosion at an airbase in Tehran's Mehrabad Airport. pic.twitter.com/lYejFWWrpf
— Iran International English (@IranIntl_En) June 13, 2025
ఎయిర్స్ట్రైక్స్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. సుమారు 100 డ్రోన్లతో విరుచుకుపడింది. కొన్ని గంటల్లోనే ఇరాన్ వందకుపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ చీఫ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ 100కు పైగా డ్రోన్స్ను ప్రయోగించింది. వాటిని మా దళాలు కూల్చివేశాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు మా సైన్యం పనిచేస్తున్నది” అని తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 200 ఫైటర్ జెట్స్ ఆ దేశమంతటా దాదాపు 100 లక్ష్యాలను ఢీకొట్టాయని వెల్లడించారు. శుక్రవారం రాత్రి కూడా వందలాది మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా సామాన్య జనం భయంతో వణికిపోతున్నారు.