
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి స్పందించాడు. తన పక్కనే విమానం కూలిపోయిందని .. అప్పుడు తాను భోంచేస్తున్నానని వైద్య విద్యార్థి హర్షిత్ తెలిపాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించాడు.
బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనం.. శిథిలమైన ఎయిర్ ఇండియా విమానం చిత్రాలను కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) విడుదల చేసింది. ఇక్కడ చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులు చికిత్సపొందుతున్నారు. ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 20 నుండి 30 మంది విద్యార్థులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని FAIMA తెలిపింది.
ప్రమాదం జరిగిన విమానంలో కనీసం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 7 మంది పోర్చుగీస్ వారు, 1 కెనడియన్ వారు ఉన్నారు.ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు.
మరో పత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం…నా కార్యాలయం విమానం క్రాష్ అయి పడిపోయిన స్థలం నుంచి 200 మీటర్ల దూరంలో ఉందన్నారు. ఆఫీసు నుంచి వస్తుండగా చాలా పెద్ద శబ్దం వినిపించింది.. ఆ తరువాత వెంటనే ఆప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. ఆ తరువాత తాను ఆ ప్రదేశానికి వెళ్లానని విమాన శిథిలాలు చెల్లచెదురుగా పడి మంటలు చెలరేగుతున్నాయని తెలిపాడు. వేడి చాలా తీవ్రంగా ఉందని.. విమానం రెక్కలు కాలిపోతున్నాయని తెలిపాడు. ఆ ప్రాంతం అంతా గందరగోళ వాతావరణం ఉందని.. ప్రయాణికులు అరుస్తున్న శబ్దాలు కూడా వినిపించాచని తెలిపారు. అయినా వేడి తీవ్రతకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని వివరించాడు.