
- ఛత్రినాకకు చెందిన వృద్ధ దంపతులను మోసగించిన దొంగ బాబా
- వరంగల్ జిల్లా కేంద్రంగా దుర్గాదేవీ, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం పేరుతో ఫ్రాడ్
- నిందితుడిని అరెస్ట్ చేసిన సిటీ సౌత్ఈస్ట్ టాస్క్ఫోర్స్
హైదరాబాద్, వెలుగు : నరదోషం, ప్రాణగండం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ జ్యోతిష్యుడు సిరిగిరి మంజునాథ్ అలియాస్ బ్రహ్మం, కోయరాజు, అర్జున్రాజు, మంజు(38)ను సిటీ సౌత్ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రూ.14.65 లక్షలు క్యాష్, క్రెడిట్, డెబిట్ కార్డులు,సెల్ఫోన్స్, ఇతర పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కేంద్రంగా ‘దుర్గాదేవీ జ్యోతిష్యాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం’ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను సిటీ సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు.
యూట్యూబ్ చానెల్స్లో యాడ్స్..
ఓల్డ్ సిటీలోని ఛత్రినాకకు చెందిన కందాడి శ్రీకాంత్రెడ్డి తల్లి 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమెకు వివిధ హస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నా రోగం తగ్గలేదు. శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులకు మూఢ నమ్మకాలున్నాయి. యూట్యూబ్ చానెల్స్లో ప్రసారం అయ్యే బాబాల కార్యక్రమాలను బాగా చూసేవారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కరీమావాడ కోయవాడకు చెందిన సిరిగిరి మంజునాథ్ దుర్గాదేవీ జ్యోతిష్కాలయం పేరుతో ఉన్న యాడ్ ను చూశారు. మంజునాథ్ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్లో కనిపించిన 9866689153 నంబర్కి నవంబర్లో కాల్ చేశారు. దీంతో శ్రీకాంత్రెడ్డి తల్లిదండ్రులను వరంగల్లోని మంజునాథ్ తన జ్యోతిష్యాలయానికి పిలిపించాడు.
జ్యోతిష్యం, నరదోషం పేరుతో మాయ
జ్యోతిష్యం, నరదోషం, ప్రాణగండం లాంటి దోషాలను తొలగించేందుకు తాంత్రిక పూజలు చేస్తానని మంజునాథ్ ఆ వృద్ధ దంపతులను నమ్మించాడు. నవంబర్ 4న చత్రినాకలోని శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రుల వద్దకు మంజునాథ్ వచ్చాడు. వారు ఉంటున్న ఇంటిని పరిశీలించాడు. ఇంటికి ‘నరదోషం’ ఉన్నదని చెప్పాడు. నరదోషం వల్లనే ప్రాణగండం కూడా ఉంటుందని భయపెట్టాడు. శ్రీకాంత్రెడ్డి తల్లి ఆరోగ్యంగా మెరుగుపడాలంటే వివిధ రకాల తాంత్రిక పూజలు నిర్వహించాలని సూచించాడు. దీంతో పూజలు చేసేందుకు బాధితులు అంగీకరించారు.
ఇందుకోసం మంజునాథ్ మొదటి విడతలో రూ.2 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో మొత్తం రూ.17 లక్షలు వసూలు చేశాడు. అయితే, తన తల్లిదండ్రులు మంజునాథ్కు డబ్బులు ఇస్తుండటంతో శ్రీకాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే మంజునాథ్ మోసం చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి గుర్తించాడు. ఈ నెల 10న ఛత్రినాక పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. వరంగల్ కేంద్రంగా దుర్గాదేవీ జ్యోతిష్యాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మంజునాథ్ కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం ఎంజీబీఎస్ బస్స్టేషన్లో అతడిని అరెస్ట్ చేశారు. జ్యోతిష్యం,తాంత్రిక పూజల పేరుతో జనాలను మోసం చేస్తున్నట్లు మంజునాథ్ అంగీకరించాడు. నిజానికి తనకు ఎలాంటి పూజలు తెలియవని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. మంజునాథ్ బారిన పడి మోసపోయిన బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.