కూకట్పల్లి/సైఫాబాద్: నగరంలోని రెండు కీలక ప్రాంతాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్తో పాటు అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. మంగళవారం ఉదయం జేఎన్టీయూ కార్యాలయానికి ఒక ఈ-మెయిల్ వచ్చింది. అందులో క్యాంపస్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరించడంతో వర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కలిసి అంగుళం అంగుళం తనిఖీ చేశారు. క్లాస్ రూమ్లు, ఆడిటోరియం, హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనంతరం ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఉద్రిక్తత
మరోవైపు, సైఫాబాద్ పరిధిలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో గాయత్రి షాబాద్ సయ్యద్ పేరిట ఒక మెయిల్ వచ్చింది. కార్యాలయంలో విషవాయువులతో కూడిన 13 బాంబులను పేల్చుతామని, ముస్లిం ఉద్యోగులను మాత్రమే బయటకు పంపాలని ఆ మెయిల్లో పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే కార్యాలయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. గంట పాటు సాగిన గాలింపులో ఎలాంటి బాంబులు దొరకకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని నిర్ధారించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, మెయిల్స్ పంపిన ఆగంతకులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
