భోపాల్: వ్యాక్సినేషన్ సహా ఇతరత్రా కరోనా సేవల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ దుర్వినియోగానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ పోర్టల్ ద్వారా చాలామందికి వ్యాక్సినేషన్ సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు తేల్చారు. దీనిపై మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో దర్యాప్తు ప్రారంభమైంది.
మే 30న బింధ్లో ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కావాలంటూ ఆరోగ్యశాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో ఎలాంటి వ్యాక్సినేషన్ కార్యకలాపాలు నిర్వహించలేదు.
ఈ క్రమంలో దీనిపై దర్యాప్తు జరపగా.. కొవిన్ పోర్టల్ ద్వారా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు పంపిణీ చేయడానికి భింద్లోని ఓ ఉప-ఆరోగ్య కేంద్రం(ఎస్హెచ్సీ)లో నకిలీ టీకా సెషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. టీకా తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్ పొందిన 36 మందిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.