
జైనూర్, వెలుగు: యూరియా కోసం జైనూర్మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఎరువు అందడంలేదని గురువారం ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది రైతులు జైనూర్ అగ్రికల్చర్ ఆఫీస్ను ముట్టడించారు. మండలానికి నాలుగు లారీల యూరియా అవసరముంటే, ఎందుకు ఒక్క లారీ ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మాకు ఎలా సరిపోతుందని అగ్రికల్చర్ ఏడీఏ వెంకట్ను నిలదీశారు.
సరిపడా నిల్వలు వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పంటలు నాశనం కాకముందు యూరియా సరఫరా చేయాలని స్థానికులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.