ఆవేశానికి లోనై.. చట్టాన్ని అతిక్రమించొద్దు : ఆశిష్​సాంగ్వాన్

 ఆవేశానికి లోనై.. చట్టాన్ని అతిక్రమించొద్దు : ఆశిష్​సాంగ్వాన్
  •    ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత రైతులతో కలెక్టర్
     

నిర్మల్, వెలుగు: రైతులు చట్టాన్ని అతిక్రమించి.. ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని నిర్మల్​జిల్లా కలెక్టర్ ఆశిష్​సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ‘కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్’ పేరిట రైతులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 

గుండంపల్లి, దిలావర్పూర్ మధ్యలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీతో తమకు జరిగే నష్టాలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఉన్న అపోహలను తొలగించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి రైతులందరికి దిశా నిర్దేశం చేస్తామన్నారు. రైతులు ఆవేశానికి లోనై చట్టాన్ని అతిక్రమించ వద్దని కోరారు. సమావేశంలో సంబంధిత  అధికారులు, రైతులు పాల్గొన్నారు.