
మాగనూర్, వెలుగు: మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని రైతులు గురువారం మండలంలోని రెడం వద్ద 167 హైవేపై వడ్ల ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు. గురువారం హైవేపై రోడ్డుకు అడ్డంగా వడ్ల లోడుతో ఉన్న ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గన్నీ బ్యాగుల కోసం అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ కోసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, మిల్లుకు పోయాక రెండు కిలోలు అదనంగా ఇస్తేనే దింపుకుంటామని చెబుతున్నారని వాపోయారు.
అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరలో రైస్ మిల్లులు ఉన్నా దూరప్రాంతాలకు ట్రక్ షీట్ రాస్తున్నారని పేర్కొన్నారు. దూరంగా ఉన్న మిల్లులకు ట్రాక్టర్లలో వడ్లను తరలించలేమని, సరిపడా లారీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. మాగనూర్ ఎస్సై అశోక్ బాబు, ఏవో సుదర్శన్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.