- నల్గొండ జిల్లా పర్యటనలో గవర్నర్ తమిళిసైకి రైతుల వినతి
నల్గొండ, వెలుగు: ‘వడ్లు తెచ్చి శానా రోజులైతంది.. మీరన్న త్వరగా కొనిపించండి మేడం’ అని రైతులు రాష్ట్ర గవర్నర్తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. బుధవారం నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్.. పట్టణంలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్, తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె సెంటర్లలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్జాలబావి సెంటర్లో పానగల్కు చెందిన మహిళా రైతు ఎల్లమ్మతో గవర్నర్మాట్లాడారు. ‘నేను మీకు తెలుసా’ అని అడిగారు. దీంతో ‘మీరు గవర్నర్ మేడమ్’ అని ఎల్లమ్మ బదులు చెప్పింది.
తర్వాత చర్లపల్లికి చెందిన మందడి మధుసూదన్ రెడ్డి అనే రైతుతో గవర్నర్ మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో వరి వేశారు? ఎంత దిగుబడి వచ్చింది? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగారు. తేమ పేరుతో వడ్లు కొంటలేరని గవర్నర్ కు రైతులుచెప్పారు. అనిశెట్టి దుప్పలపల్లి ఐకేపీ సెంటర్ మహిళలతో గవర్నర్గ్రూపు ఫొటో దిగారు. అంతకు ముందు నల్గొండ జిల్లా కేంద్రం షేర్బంగ్లాలో సంతోషిమాత దేవాలయాన్ని గవర్నర్ప్రారంభించారు. గవర్నర్కు సీపీఎం, సీపీఐ ప్రతినిధి బృందాలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎఫ్సీఐ గోడౌన్లలో పేరుకుపోయిన బియ్యాన్ని వెంటనే ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మిల్లుల్లో జాగ లేక వానాకాలం కొనుగోళ్లు లేట్అవుతున్నాయని చెప్పారు.