తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొలెస్ట్రాల్ పెరుగుతోందట!

తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొలెస్ట్రాల్ పెరుగుతోందట!

తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎక్కువవుతోంది

ఇంపీరియల్​ కాలేజీ లండన్​తో కలిసి ఎన్​ఐఎన్​ స్టడీ

1980 నుంచి 2018 వరకకు 39 ఏళ్ల పాటు రీసెర్చ్​

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చెడు కొలెస్ట్రాల్​ (కొవ్వు) పెరిగిపోతుంది. ఒంటికి మంచి చేసే మంచి కొలెస్ట్రాల్​ తగ్గుతోంది. అయితే సగటు ఇండియన్​ కొలెస్ట్రాల్​ స్థాయులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. లండన్​లోని ఇంపీరియల్​ కాలేజీతో కలిసి ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​)– నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​ (ఎన్​ఐఎన్​) సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. వెల్​కమ్​ ట్రస్ట్​, బ్రిటీష్​ హార్ట్​ ఫౌండేషన్​లు స్టడీకి ఫండింగ్​ ఇచ్చాయి. 1980 నుంచి 2018 వరకు 39 ఏళ్ల పాటు 200 దేశాల్లోని 10.26 కోట్ల మందిని స్టడీ చేసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆహారంలో మార్పులు, సరైన ఎక్సర్​సైజులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చారు. తినే తిండిలో పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులను ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించొచ్చని చెప్పారు. వెస్టర్న్​ కంట్రీస్​లో మంచి కొలెస్ట్రాల్​ పెరుగుతుంటే, తూర్పు, దక్షిణాసియా దేశాల్లో చెడు కొలెస్ట్రాల్​ పెరుగుతున్నట్టు గుర్తించారు.

128వ స్థానంలో ఇండియా

ప్రపంచవ్యాప్తంగా చెడు కొలెస్ట్రాల్​తో ఏటా 39 లక్షల మంది చనిపోతున్నట్టు స్టడీలో సైంటిస్టులు తేల్చారు. ఒకప్పుడు కొలెస్ట్రాల్​ విషయంలో మెరుగ్గా ఉన్న చైనా, ఆసియా దేశాల ప్రజల్లో ఇప్పుడు కొలెస్ట్రాల్​ ఎక్కువైంది. ఈ విషయంలో ఇండియా స్థానం మారలేదు. 128వ స్థానంలో ఉంది. మన దేశంలో కొలెస్ట్రాల్​ పెరుగుదల 30 ఏళ్లలోపు వారిలో తక్కువగా, 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. దేశ ప్రజల్లో సగటున 22 శాతం కొలెస్ట్రాల్​ ఉన్నట్టు తేల్చారు. ఈ విషయంలో 1980ల్లో మహిళల కొలెస్ట్రాల్​ స్థాయిలో 139వ స్థానంలో ఉంది ఇండియా. ఇప్పుడు అది 140కి పెరిగింది. మగవాళ్లలో అప్పుడూ..ఇప్పుడూ 128వ స్థానంలోనే ఉంది. ప్రపంచవ్యాష్తంగా ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్​ స్థాయులు పెరగడం ఆందోళన కలిగించే అంశమని ఎన్​ఐఎన్​ డైరెక్టర్​ డాక్టర్​ హేమలత అన్నారు.

చెడు కొలెస్ట్రాల్​ పెరిగితే గుండెకు ముప్పు

కణాలను తయారు చేసి ఎదుగుదలకు దోహదపడుతుంది కొలెస్ట్రాల్.అది తక్కువైనా ఎక్కువైనా నష్టమే. చెడు కొలెస్ట్రాల్​ స్థాయులు పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి రక్తం అందక గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుంది. కొలెస్ట్రాల్​ను టోటల్​ కొలెస్ట్రాల్​, ఎల్​డీఎల్​(లో డెన్సిటీ లైపోప్రొటీన్​– ఇది చెడు కొలెస్ట్రాల్​), ట్రైగ్లిజరైడ్స్​, హెచ్​డీఎల్​ (హై డెన్సిటీ లైపోప్రోటీన్​– మంచి కొవ్వు)గా విభజించవచ్చని, ఇందులో ఎల్​డీఎల్​, ట్రైగ్లిజరైడ్స్​ హాని చేస్తాయని స్టడీలో పాల్గొన్న ఎన్​ఐఎన్​ పబ్లిక్​ హెల్త్​ న్యూట్రిషన్​ హెడ్​ డాక్టర్​ ఎ. లక్ష్మయ్య చెప్పారు. టోటల్​ కొలెస్ట్రాల్​​తెలుగు రాష్ట్రాల పురుషుల్లో 23 శాతం ఉండగా, మహిళల్లో 21 శాతం ఉందని, ఎల్​డీఎల్​ పురుషుల్లో​23 శాతం ఉండగా, మహిళల్లో 25 శాతం ఉన్నట్లు గుర్తించారు. ట్రైగ్లిజరైడ్స్​పురుషుల్లో 46%, మహిళల్లో 29 శాతం ఉన్నట్లు తేల్చారు.

For More News..

డీపీఆర్‌‌లు ఇచ్చేవరకూ ప్రాజెక్టులు ఆపండి

కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇరిగేషన్‌కు మల్లిస్తున్నరు

ఈసారి బోనాల పండుగ లేనట్లే

50 ఏళ్లు దాటితే.. గండమే