
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ మొదటి క్వార్టర్లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) విలువ 15 శాతం పెరిగి 18.62 బిలియన్ డాలర్లకు చేరింది. టారిఫ్ సమస్యలు ఉన్నప్పటికీ అమెరికా నుంచి పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి 5.61 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్లో ఎఫ్డీఐల విలువ 16.17 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్వార్టర్లో అమెరికా 5.61 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అతిపెద్ద ఎఫ్డీఐ వనరుగా అవతరించింది.
ఆ తర్వాత సింగపూర్ (4.59 బిలియన్ డాలర్లు), మారిషస్ (2.08 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఈసారి కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ (5.4 బిలియన్ డాలర్లు) రంగాల్లో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. సర్వీసెస్ (3.28 బిలియన్ డాలర్లు), ఆటోమొబైల్ (1.29 బిలియన్ డాలర్లు), పునరుత్పాదక ఇంధనం (1.14 బిలియన్ డాలర్లు) వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగాయి. కర్ణాటక అత్యధికంగా 5.69 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది.
ఆ తర్వాత మహారాష్ట్ర (5.36 బిలియన్ డాలర్లు), తమిళనాడు (2.67 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎఫ్డీఐ పాలసీని రూపొందించింది. చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది.