
- ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్కు ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని నేషనల్ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ)ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ నిర్ణయంతో పేద, బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ గంగరాం ఆహీర్తో ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాలు భేటీ అయ్యాయి.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఏపీలో 28 బీసీ కులాలను ఓబీసీలోకి చేర్చాలని కోరారు. కేంద్రం బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి.. ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికీకరణతో దెబ్బతిన్న కుల, చేతి వృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు.