- మాల్స్కు ‘పండగే’
- ఈసారి డిస్కౌంట్లు తక్కువే.. డిమాండ్ ఎక్కువ ఉండటమే కారణం
న్యూఢిల్లీ: దుస్తులు, ఎలక్ట్రానిక్స్, లైఫ్స్టైల్ ప్రొడక్టులు అమ్మే మాల్స్, షాపులు ఖుషీఖుషీగా ఉన్నాయి. ఈసారి పండగ అమ్మకాలు చాలా బాగున్నాయ్. కొన్ని వారాలుగా అమ్మకాలలో రికార్డు గ్రోత్ కనిపిస్తోంది. నవరాత్రితో ప్రారంభమయ్యే పండుగల సీజన్లో డిమాండ్ దశాబ్దాల గరిష్టస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది ముగిసేదాకా ఈ జోరు కొనసాగుతుందని అంటున్నారు. కస్టమర్లు ఎగబడి కొంటుండంతో చాలా బ్రాండ్లు ఈసారి పెద్దగా డిస్కౌంట్లను ఇవ్వడం లేదు. "మేం భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పుడు చూస్తున్న డిమాండ్ అత్యధికం. సానుకూల సెంటిమెంట్, తాజా స్టాక్వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. పండుగ సీజన్ అమ్మకాలు ఈ సంవత్సరం బాగుంటాయని మేం ఆశిస్తున్నాం. గ్రోత్ రెండంకెల మేర ఉంటుందని అనుకుంటున్నాం" అని లైఫ్స్టైల్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవరాజన్ అయ్యర్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో దుస్తులు, డిస్క్రెషనరీ ( విచక్షణ) వస్తువుల విభాగాల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఈసారి అమ్మకాలు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, దుస్తులు, లైఫ్స్టైల్ ప్రొడక్టులు, రెస్టారెంట్లు మార్చి క్వార్టర్లో సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ఆఫీసులు, సామాజిక సమావేశాలు తిరిగి మొదలైన తర్వాత షాపులు, మాల్స్ కళకళలాడుతున్నాయి. రెండు సంవత్సరాల కోవిడ్ ఒత్తిడి తర్వాత ఇది మొదటి ఫెస్టివల్ సీజన్కావడంతో మాల్ నిర్వాహకులు బిజీ అయ్యారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) చేసిన సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రిటైల్ వ్యాపారాలు ప్రీ -పాండమిక్ స్థాయిలతో (ఆగస్టు 2019) పోలిస్తే ఆగస్టు అమ్మకాలలో 15శాతం వృద్ధిని సాధించాయి. తమ పోర్ట్ఫోలియోలో దాదాపు 10శాతం అమ్మకాలు ఫిట్-అవుట్లో విభాగం ఉన్నాయని ఢిల్లీ–ఎన్సీఆర్ అంతటా ప్రీమియం మాల్స్ను నిర్వహిస్తున్న డీఎఫ్ఎఫ్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పా బెక్టర్ అన్నారు.
“సాధారణంగా ఈ సంఖ్య 3–-4శాతం వరకు ఉంటుంది. ఈ సంవత్సరం బ్రాండ్లు కస్టమర్లను ఆకర్షించడానికి మరింత ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే గత రెండేళ్లుగా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఈసారి కస్టమర్ల రాక కూడా రికార్డు స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం” అని ఆమె వివరించారు. సాధారణంగా మనదేశంలో ఓనమ్ నుంచి దుర్గాపూజ వరకు గిరాకీ బాగుంటుందని, ఈసారి డిమాండ్ బలంగా ఉండటంతో డిస్కౌంట్లు కూడా పెద్దగా ఇవ్వలేదని ఫ్రెంచ్ అప్పరెల్ బ్రాండ్సీలియో సీఈఓ సత్యేన్ మొమయా వివరించారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉన్నా అర్బన్ కస్టమర్లు డిస్క్రెషనరీ ప్రొడక్టులను బాగానే కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు తక్కువగా ఉండొచ్చని వివరించారు.రూ.2.60 లక్షల కోట్లుఈసారి ఫెస్టివల్ సీజన్లో దాదాపు 32 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.2.60 లక్షల కోట్లు) అమ్మకాలు జరుగుతాయని కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. వినియోగదారుల ఖర్చు 2021 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 2019 లో ఫెస్టివల్ ఈ 37 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. దీపావళి, కిరాణా సామాగ్రి, హోం రినోవేషన్ వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారని ఈ సర్వే తెలిపింది.
అప్లయెన్స్ ఇండస్ట్రీ అదుర్స్..
కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ ఇండియా ప్రకారం, ఈ పండుగ సీజన్లో అప్లయెన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే 35శాతం వృద్ధిని సాధించింది దుస్తులు, కాస్మొటిక్స్, ఆరోగ్యం, నగల అమ్మకాలు చాలా బాగున్నాయి. ఏడాది లెక్కన ఈసారి 20 శాతం వరకు గ్రోత్ ఉండొచ్చని ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారాలు అనుకుంటున్నాయని థార్న్టన్కు చెందిన నవీన్ మల్పానీ అన్నారు. ప్రీపాండమిక్ లెవెల్స్తో పోలిస్తే రిటైల్ బిజినెస్15 శాతం పెరిగిందని వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో ఈసారి సేల్స్ భారీగా రికార్డు కావొచ్చని చెప్పారు. షాపులతోపాటు సప్లై చెయిన్ సంస్థలు కూడా బిజీగా ఉంటున్నాయి. పంపిణీదారులు, డీలర్లు వేర్హౌసింగ్ కంపెనీలకు డిమాండ్ బాగుందని ఢిల్లీకి చెందిన ఎన్బీఎఫ్సీ లివ్ఫిన్ డైరెక్టర్ హర్షద్ మల్హోత్రా అన్నారు. పండుగ సీజన్లో ఏడాది క్రితం నెలకు రూ.90-–100 కోట్ల వరకు లోన్లు ఇచ్చామని, ఈసారి నెలకు రూ.170 కోట్ల విలువైన లోన్లు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్కు మిగతా వాటి కంటే ఎక్కువ డిమాండ్ ఉందని హర్షద్ అన్నారు.