- స్పీకర్ బాక్స్లు, హెడ్ఫోన్లు, ఇయర్ బడ్స్కు కూడా
- ఈ సీజన్లో 20 శాతం గ్రోత్ అంచనా వేస్తున్న కంపెనీలు
- పెద్ద రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్ల సేల్స్ కూడా పెరుగుతాయని వెల్లడి
న్యూఢిల్లీ: టీవీలు అమ్మే కంపెనీలు పండుగ సీజన్, క్రికెట్ వరల్డ్ కప్పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. కేరళలోని ఓనం పండుగతో సౌత్ ఇండియాలో పండుగ సీజన్ మొదలయ్యింది. ఈ సీజన్ ముగిసే నాటికి కిందటేడాదితో పోలిస్తే అమ్మకాలు 18–20 శాతం పెరుగుతాయని కంపెనీలు అంచనావేస్తున్నాయి.దీనికి తోడు ఇండియాలో ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉండడంతో టీవీలకు ఫుల్ డిమాండ్ ఉందని పేర్కొన్నాయి. క్రికెట్ వరల్డ్ కప్, ఫెస్టివ్ సీజన్ కలిసి రావడం 1987 తర్వాత ఇదే మొదటిసారి. ఈ పండుగ సీజన్లో టీవీల సేల్స్ ముఖ్యంగా పెద్ద సైజ్ టీవీల అమ్మకాలు పుంజుకుంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా స్పీకర్లు, సౌండ్ బాక్స్లు, వైర్లెస్ హెడ్ఫోన్లు, ఇయర్ బడ్స్ వంటి ఆడియో ప్రొడక్ట్లకు మంచి గిరాకీ ఉంటుందని అంచనావేస్తున్నారు.
ప్రీమియం ప్రొడక్ట్ల వైపే..
కిందటేడాది పండుగ సీజన్ మాదిరే ఈసారి కూడా సేల్స్ వాల్యూమ్స్ ఉంటాయని గోద్రెజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. కానీ, ఎక్కువ రేటుండే ప్రీమియం ప్రొడక్ట్ల సేల్స్ కిందటేడాదితో పోలిస్తే 30 శాతం ఎక్కువగా జరుగుతాయని అంచనావేశారు. ‘మాస్ సెగ్మెంట్లో సేల్స్ పెద్దగా పెరగకపోవచ్చు. ఈ ఏడాది మొదటి క్వార్టర్ నుంచి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉండడంతో డిస్క్రిషనరీ (విచక్షణాత్మక) ప్రొడక్ట్ల సేల్స్ తగ్గుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో ఇక్కడి ప్రజల అగ్రికల్చర్ ఇన్కమ్ పడిపోయే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావం మాస్ సెగ్మెంట్పై పడుతుంది. అందుకే ఈ సెగ్మెంట్లో సేల్స్ పెద్దగా పెరగవని అంచనా వేస్తున్నాం’ అని ఆయన వివరించారు.
అప్లియెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఈ ఏడాది రూ.70 వేల కోట్ల విలువైన అమ్మకాలు జరుపుతుందని అంచనా. పండుగ సీజన్ ఓనమ్తో మొదలై దీపావళి వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మొత్తం సేల్స్లో పండుగ సీజన్ సేల్స్ వాటా 25–27 శాతం వరకు ఉంటుందని అంచనా. సమ్మర్లో ఇబ్బంది పడిన ఏసీ తయారీ కంపెనీలు, పెంటప్ డిమాండ్ వలన పండుగ సీజన్లో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నాయి. ‘వర్షాలు తక్కువగా పడుతుండడంతో వర్షాకాలంలో కూడా డిమాండ్ ఉంది. టెంపరేచర్స్ గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి.
సౌత్, నార్త్ ఇండియా రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని కొన్ని మార్కెట్లలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు తక్కువగా ఉండడం, ఉక్కపోత వలన నార్త్ ఇండియాలో ఏసీలకు ఎక్కువ డిమాండ్ ఉంది’ అని కమల్ నంది వెల్లడించారు. స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల సేల్స్ పెరుగుతాయని, ఈ పండుగ సీజన్లో డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తామని పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఎండీ ఫుమియాసు ఫుజిమొరి పేర్కొన్నారు. ప్రొడక్ట్ల వాల్యూమ్ కంటే ప్రీమియం ప్రొడక్ట్ల సేల్స్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఇన్వెర్టర్ ఏసీలు, 4కే అండ్రాయిడ్ ఎల్ఈడీల సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనావేశారు. తమ ఓనమ్ సేల్స్ 20 శాతం వృద్ధి నమోదు చేశాయని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జీటీఎం ఆశిష్ అగర్వాల్ వెల్లడించారు. పండుగ కంటే ముందే దీపావళి ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. కొత్త ఇండ్లకు మారడం వలన చాలా మంది కన్జూమర్లు తమ ప్రొడక్ట్లను అప్గ్రేడ్ చేసుకుంటున్నారని, పెద్ద టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు.
55 ఇంచుల పైనే..
55 ఇంచుల కంటే పెద్ద స్క్రీన్ సైజ్ ఉన్న టీవీల సేల్స్ పెరుగుతాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్, పానాసోనిక్, థామ్సన్ వంటి కంపెనీలు వెల్లడించాయి. క్యూఎల్ఈడీ టీవీల ప్రీమియం, అల్ట్రా ప్రీమియం రేంజ్ టీవీల సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 5 – 19 మధ్య క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. పెద్ద టీవీలు, ఎక్కువ కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల సేల్స్ 30 శాతం పైగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిందటేడాది పండుగ సీజన్లో మాదిరే ఈసారి కూడా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొత్త ప్రొడక్ట్లను తీసుకొస్తున్నాయి. యాడ్స్తో క్యాంపెయిన్లను స్టార్ట్ చేశాయి. మాస్ (తక్కువ రేటున్న) సెగ్మెంట్లోనూ కొత్త ప్రొడక్ట్లు తెస్తున్నాయి.