న్యూఢిల్లీ/గౌహతి: అస్సాం సిటిజన్స్ ఫైనల్ లిస్ట్ శనివారం ఉదయం రిలీజ్ అవుతుంది. అస్సాంలో స్థిరపడ్డవారిలో ఎంతమంది మనవాళ్లు, ఎంతమంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు అన్న ఇష్యూకి సంబంధించిన వివరాలతో ఫైనల్ డ్రాఫ్ట్ను ఈ ఏడాది జులై 30న రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ ఫైనల్ డ్రాఫ్టులో మూడు కోట్ల 29 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు 41 లక్షల మంది దరఖాస్తుదారుల పేర్లు తొలగించారు. దీంతో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) శనివారం రిలీజ్చేసే ఫైనల్ లిస్ట్లో తమ పేర్లు ఉంటాయో ఉండవో అన్న టెన్షన్ వీళ్లలో నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దుచేసి, దాన్ని రెండు యూనియన్ టెరిటరీలుగా మార్చిన తర్వాత… మరో పెద్ద డెవలప్మెంట్ ఎన్ఆర్సీ ఫైనల్ లిస్ట్ ప్రకటనే అని చెప్పొచ్చు. ‘‘ శనివారం ఉదయం పది గంటల కల్లా ఆన్లైన్లో లిస్ట్ అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్లు లేనివాళ్లు రాష్ట్ర సర్కార్ ఏర్పాటుచేసిన సేవా కేంద్రాల్లో తమ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు’’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
- అస్సాంలో అక్రమంగా వచ్చినవాళ్లను తిరిగి పంపించేయాలన్న డిమాండ్తో ఆల్ అస్సాం స్డూడెంట్స్ యూనియన్ ఆరేళ్లపాటు ఉద్యమాన్ని నడిపింది. అస్సాం ఒప్పందంపై సంతకంతో ఈ యూనియన్ 1985లో ఆందోళనను నిలిపేసింది.
- నిజమైన సిటిజన్స్ను గుర్తించి , అక్రమంగా వచ్చినవాళ్లను తిరిగి పంపాలని ఉద్దేశంతో ఎన్ఆర్సీని అప్ డేట్ చేయాలని సుప్రీంకోర్టు 2013లోనే ఆదేశించినా, నిజమైన ఎక్సర్ సైజ్ మాత్రం ఫిబ్రవరి 2015లోనే మొదలైంది.
- ఫైనల్ ఎన్ఆర్సీలో పేరులేనివాళ్లను వెంటనే విదేశీయులని డిక్లేర్ చేయమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాళ్లంతా ఫార్నర్స్ ట్రిబ్యునల్కు వెళ్లొచ్చు. అపీలు చేసుకునే గడువును 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు.
- వివాదమున్న కేసుల్ని విచారించేందుకు 1000 ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేస్తామని హోంమినిస్ట్రీ చెప్పింది. ఇప్పుడు 100 ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. మరో 200 ట్రిబ్యునళ్లను సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభిస్తారు. ట్రిబ్యునల్లో కేసు ఓడిపోయినవాళ్లు హైకోర్టుకు, ఆతర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. లీగల్ ఆప్షన్లు పూర్తిగా మూసుకుపోయే వరకు ఎవర్నీ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించమని సర్కార్ స్పష్టంచేసింది.
- ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న నేపథ్యంలో అస్సాంలో సెక్యూరిటీని పెంచారు. గౌహతితోపాటు ఇంతకుముందు గొడవలు జరిగిన సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా 144 సెక్షన్ను విధించారు. రాష్ట్రానికి అదనంగా 20 వేల పారామిలటరీ ఫోర్స్ను కేంద్రం పంపింది.
- పుకార్లను నమ్మొద్దని, ఫైనల్ లిస్ట్లో పేర్లు లేనివాళ్లకు కూడా సెక్యూరిటీ కల్పిస్తామని అస్సాం పోలీసులు ట్వీట్ చేశారు.
- ఫైనల్ లిస్ట్లో పేర్లు లేనివాళ్లు కూడా ఇండియన్ సిటిజన్షిప్ను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ హామీ ఇచ్చారు.
- ఎన్ఆర్సీలో పేర్లు లేనివాళ్ల కోసం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) 1951లో తొలిసారి అస్సాంలో పబ్లిష్ చేశారు. మార్చి 25, 1971 తర్వాత అక్రమంగా అస్సాంలోకి వచ్చి స్థిరపడ్డ విదేశీయుల నుంచి ఇండియన్ సిటిజన్స్ను వేరుచేయడానికి వీలుగా ఎన్ఆర్సీని అప్డేట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగానే తాజా అప్ డేషన్ జరుగుతోంది.