
న్యూఢిల్లీ : సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జోనల్ నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను ఆదేశించింది. సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు సహకారం అందించాలని కోరింది. పని చేయని ఖాతాల నుంచి చేసే విత్డ్రాయల్స్కు కఠినమైన నియంత్రణలు ఉండాలని స్పష్టం చేసింది.
పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ చెల్లింపుల మోసాలపై సమీక్షించేందుకు సీనియర్ బ్యాంక్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, పేమెంట్ అగ్రిగేటర్లతో మంత్రిత్వ శాఖ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడిని పెంచాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలతో సమన్వయం చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పేరుతో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఈ సంవత్సరం రూ. 600 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను బ్లాక్ చేశారు.
బ్యాంకులకు సూచనలు
సైబర్ క్రైమ్ రిపోర్టులపై స్పందించే సమయాన్ని బ్యాంకులు తగ్గించుకోవాలి. తద్వారా 'గోల్డెన్ పీరియడ్'లోపు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఈ గోల్డెన్ పీరియడ్ సాధారణంగా హెల్ప్లైన్ నంబర్ 1930 ద్వారా సైబర్ నేరంపై ఫిర్యాదు చేసిన 30 నిమిషాల తర్వాత ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోని ప్రతి జోన్కు ఒక నోడల్ అధికారిని నియమించాలి.