- రూ.8 లక్షల ఆస్తి నష్టం
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలకేంద్రంలో పేపర్ ప్లేట్లు తయారు చేసే గోదాములో షార్ట్సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పరిగి అగ్నిమాపక సిబ్బంది రాత్రి 8 గంటలకు ఘటనా స్థలికి చేరుకున్నారు.
వారు చేరుకునేలోపే పేపర్ ప్లేట్లు తయారు చేసే యంత్రం సహా గోదాములోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుల్కచర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టెల పొయ్యి తెచ్చిన తంటా..
పద్మారావునగర్: నగరంలోని బేగంపేట ప్రకాశం నగర్లోని ఎవర్ గ్రీన్ ఫుడ్ కార్నర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నంహోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే హోటల్ అంతటా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది.

