హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 జూలై 03 సోమవారం ఒక్కరోజే 5.10 లక్షలమంది ప్రయాణించారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో ప్రయాణించడం తొలిసారి కావడం విశేషం. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు ట్రావెల్ చేశారు. అమీర్ పేట్, ఉప్పల్, ఎల్బీనగర్ సేష్టన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ఇప్పటి వరకు 40 కోట్లమంది ప్రయాణికులు ప్రయాణించారు. కొవిడ్-19 సమయంలో ప్రయాణికుల సంఖ్య కొంత మందగించినా.. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.
క్యాష్బ్యాక్, ఉచిత ట్రిప్పులు, మెట్రో పాసులు ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో మెట్రోలో ప్రయాణించడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్ లో మెట్రో రైళ్లలో ఎక్కువ సంఖ్యలో జనాలు ప్రయాణిస్తున్నారు. మెట్రో ఉదయం 6.30 గంటల నుంచి చివరి రైలు రాత్రి 9.30 గంటల వరకు సేవలు అందిస్తోంది.